చీకటితోనే బయల్దేరి.. చీకటయ్యాక.. ఇంటికి వెళ్ళడం ‘వాలంటీర్’కి అలవాటే.! ప్రతిరోజూ ఇదే పని కాదు.! పెన్షన్ల పంపిణీ.. అదో పెద్ద తతంగం.! సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హత ధృవీకరణ, తదితర వ్యవహారాల నిమిత్తం.. కాస్త గట్టిగానే కష్టపడాలి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, ఈ వాలంటీర్ వ్యవస్థ తెరపైకొచ్చింది. గౌరవ వేతనం.. అంటూ, చేతికి ఎంతో కొంత ఇచ్చి యువతను, ఈ వాలంటీర్ పోస్టుల కోసం వైసీపీ సర్కారు నియమించింది.
ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు జరుగుతున్నాయంటే, ఆ వ్యవస్థకు చట్టబద్ధత వుండాలి.! ఏ శాఖలో అయినా ఉద్యోగి తప్పు చేస్తే, ఆ శాఖ నుంచి పూర్తిస్థాయి విచారణ జరుగుతుంది. మరి, వాలంటీర్ తప్పు చేస్తేనో.? ప్చ్.. ఏ శాఖ తరఫున ఎలాంటి విచారణ వుంటుందో ఎవరికీ తెలియదు.
మొదటి నుంచీ వాలంటీర్ వ్యవస్థపై విమర్శలొస్తూనే వున్నాయి. ఆ విమర్శలకు కారణం, ‘వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలే’ అని వైసీపీ నేతలు, అందునా మంత్రులు పరకటిస్తూ వస్తుండడమే. ఎన్నికల ముందర, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా, వాలంటీర్లంటే వైసీపీ కార్యకర్తలేనని ప్రకటించడం గమనార్హం.
సో, ఎన్నికల వేళ వాలంటీర్లను, ఎన్నికల విధుల నుంచి దూరంగా వుంచాలనే డిమాండ్ తెరపైకి రావడం సహజమే కదా.! దానికి తోడు, ఎన్నికల సమయంలో వాలంటీర్లు, సామాజిక పెన్షన్లు పంచడంపైనా నిషేధం తెరపైకొచ్చింది. అంతే, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అనూహ్యమైన రీతిలో రచ్చ చేసింది.
పెన్షన్లు ఇంటి వద్ద పంచకపోవడంతో, 31 మంది వృద్ధులు మరణించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆరోపించడంతో, వాలంటీర్ వ్యవస్థ షాక్కి గురయ్యింది. పొరుగు రాష్ట్రాల్లోనూ సామాజిక పెన్షన్లు అందుతున్నాయి. అక్కడెక్కడా వాలంటీర్ వ్యవస్థ లేదు. అక్కడెలాంటి మరణాలూ చోటు చేసుకోలేదు.!
కేవలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే సామాజిక పెన్షన్లు ఇంటి వద్ద అందకపోవడం వల్ల వృద్ధులు ప్రాణాలు కోల్పోవడమేంటి.? ఈ విషయమై వాలంటీర్లే ఆందోళన చెందుతున్నారు. ఇంకోపక్క, ఎన్నికల సమయంలో తమపై వేటు పడిందంటే, అసలు తమ వ్యవస్థకు చట్టబద్ధత ఎక్కడుందన్న వివేకం వాలంటీర్లలో పెరిగింది.
ఇన్నాళ్ళూ వైసీపీ అవసరాల కోసం తమను వాడుకుందనీ, ఇప్పుడు వృద్ధుల మరణాలంటూ వైసీపీ కొత్త వాదనకు తెరలేపిందనీ, కొన్ని చోట్ల బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని నిలదీయకుండా, వాలంటీర్లను తప్పు పడుతుండడం బాధాకరమనీ, వాలంటీర్లు ఆఫ్ ది రికార్డుగా వాపోతున్నారు.
‘మేమూ రాష్ట్ర పౌరులమే. మాకూ బాధ్యత వుంది. వైసీపీ కార్యకర్తల్లో చాలామందికి వాలంటీర్ పోస్టులు వచ్చి వుండొచ్చు. వేరే గతిలేక, ఉపాధికోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్ళలేక వాలంటీర్ పోస్టుల్లో కొనసాగుతున్నాం.. మా మీద రాజకీయ ముద్ర వేయడం బాధాకరం..’ అని కొందరు వాలంటీర్లు వైసీపీ మీద మండిపడుతున్నారు.
‘కొందరు వాలంటీర్లు అసలెందుకు రాజీనామా చేశారో మాకు అర్థం కావడంలేదు. ఆ రాజీనామాల ప్రభావం అందరి మీదా పడుతోంది.. ప్రజల దృష్టిలో పలచనైపోతున్నాం..’ అన్నది సదరు వాలంటీర్ల ఆవేదనగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా, ఏ కారణంతో ఎవరు చనిపోయినా, అక్కడికి వెళ్ళి వీడియోలు తీసి తమకు పంపాలని వైసీపీ నేతలు హుకూం జారీ చేయడం పట్ల వాలంటీర్లుగా పనిచేస్తున్నవారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘పైకి చెబితే, మా మీద భౌతిక దాడులూ జరుగుతాయ్.. అందుకే, ఏ విషయమూ పైకి చెప్పలేకపోతున్నాం..’ అన్నది మెజార్టీ వాలంటీర్ల ఆవేదన. ఇదీ, వాలంటీర్ వ్యవస్థ మీద వైసీపీ పెత్తనం.!