వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే ‘వై నాట్ 175’ అని నినదిస్తుంటారు. అసలు ఆ పరిస్థితులు రాష్ట్రంలో వున్నాయా.? అంటే, ఛాన్సే లేదు.. అని వైసీపీ నాయకులే ఆఫ్ ది రికార్డుగా చెబుతుంటారనుకోండి.. అది వేరే విషయం.
వైసీపీ నుంచి ఇప్పటికే పలువురు ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాదు, మంత్రులు కూడా ఇతర పార్టీల్లోకి దూకేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకెక్కడ వై నాట్ 175.? అసలంటూ వైసీపీకి అభ్యర్థులే దొరక్క, నానా తంటాలూ పడుతుంటేనూ.! అసలు సీటే దక్కదనుకున్నోళ్ళకి ఎంపీ టిక్కెట్లు.. రాజకీయాలు వద్దు మహాప్రభో.. అంటున్నవాళ్ళకి మళ్ళీ ఎమ్మెల్యే సీట్లు.. ఇదీ వైసీపీ పరిస్థితి.
ఇంకోపక్క, టీడీపీ – జనసేన కూటమిలోకి బీజేపీని తీసుకొచ్చే ప్రయత్నాలు దాదాపు సఫలమైనట్లే కనిపిస్తోంది. అధికారిక ప్రకటన రావడమొక్కటే తరువాయి. ఇంతకీ, బీజేపీ వల్ల జనసేన – టీడీపీ కూటమికి ఒరిగేదేముంటుంది.? టీడీపీతో పొత్తు నేపథ్యంలో తక్కువ సీట్లకే జనసేన ఎందుకు పరిమితమైంది.? అసెంబ్లీతోపాటు లోక్ సభకీ పోటీ చేయాలని జనసేనాని ఎందుకు అనుకుంటున్నారు.? ఇలా చాలా ప్రశ్నలున్నాయి.
అన్ని ప్రశ్నలకూ ఒక్కటే సమాధానం.. వై నాట్ 175.! వైసీపీ నినాదాన్ని, టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఇంకోరకంగా నిజం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. 98 శాతం స్ట్రైక్ రేట్.. అని గతంలో జనసేనాని వ్యాఖ్యానించారంటే, అందులో చాలా చాలా లోతైన అర్థం వుంది. అంతకు ముందు ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు’ అని జనసేనాని వ్యాఖ్యానించారు. అదీ అంతే.
పొత్తులో భాగంగా జనసేన ఎన్ని సీట్లు తీసుకున్నా, అందులో ఒక్కటీ ఓడిపోకూడదన్నది జనసేనాని వాదన. టీడీపీకి కూడా జనసేనాని ఇదే షరతు పెట్టారట. బీజేపీ ముందరకు కూడా ఇదే ప్రతిపాదనను జనసేనాని తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది.
కూటమి అభ్యర్థి ఓడిపోవడమంటే, ఆ సీటులో అధికార వైసీపీ గెలుస్తుంది. సో, కూటమి అభ్యర్థి ఓడిపోకుండా కార్యాచరణ సిద్ధం చేయాలి గనుకనే, ఛాన్స్ తీసుకోకుండా బీజేపీని కూడా కూటమిలోకి జనసేనాని లాక్కొచ్చినట్లు తెలుస్తోంది.
కానీ, వైసీపీ అర్థ బలం ముందర, టీడీపీ – జనసేన – బీజేపీ ‘వై నాట్ 175’ వ్యూహం ఎంతవరకు సఫలమవుతుందన్నది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ క్వశ్చన్. బీజేపీ గనుక సీన్లోకి దిగితే, వైసీపీని కొన్ని కొన్ని విభాగాల్లో గట్టిగానే కట్టడి చేయడానికి ఆస్కారం దొరుకుతుంది. అది తప్ప, ఓట్ల పరంగా బీజేపీ నుంచి టీడీపీ – జనసేన కూటమికి ఒరిగేదేమీ వుండదు.