ఎన్డీయే కూటమిలోకి తెలుగు దేశం పార్టీని తీసుకెళ్ళడంలో జనసేన పార్టీ విజయం సాధించింది. 2024 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్లో ఎన్డీయే కూటమిగా బీజేపీ – టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయనున్నాయి.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేరకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడినీ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్నీ ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానిస్తూ ట్వీట్ వేయడం గమనార్హం.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను.. అని గతంలో ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వ్యూహాత్మకంగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇంకో వైపు జనసేన – టీడీపీ మధ్య పొత్తు కొనసాగుతోంది. అయితే, టీడీపీని తిరిగి ఎన్డీయేలోకి తీసుకునేందుకు బీజేపీ అధినాయకత్వం మీనమేషాల్లెక్కెడుతూ వచ్చింది.
ఎట్టకేలకు జనసేనాని చొరవ ఫలించింది ఎన్డీయేలోకి టీడీపీని సైతం బీజేపీ అధినాయకత్వం ఆహ్వానించింది. రెండ్రోజులుగా ఢిల్లీ బీజేపీ పెద్దలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అవుతూ వస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పటికే భేటీ అయిన సంగతి తెలిసిందే.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్లో పోటీ చేయబోయే నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ – బీజేపీ – జనసేన మధ్య చర్చ జరిగింది.
మొత్తంగా ఆరు లోక్ సభ సీట్లను బీజేపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సీట్ల పరంగా పెద్దగా బీజేపీకి డిమాండ్లు ఏమీ లేవు. ఓ ఐదారు సీట్ల వరకు బీజేపీ కోరవచ్చు. కూటమిలోకి బీజేపీ వస్తున్న దరిమిలా, జనసేన ఓ సీటుని త్యాగం చేయాల్సి రావొచ్చన్న ప్రచారం జరుగుతుండగా, జనసేనకు అదనంగా ఓ ఎంపీ సీటు ఇవ్వాలని బీజేపీ, టీడీపీని కోరినట్లు ఇంకో వాదన కూడా తెరపైకొస్తోంది.
ఏదిఏమైనా టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి ఖరారైన దరిమిలా, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ అనూహ్యంగా మారబోతున్నాయ్. వైసీపీ నుంచి టీడీపీ, జనసేన, బీజేపీల్లోకి దూకే విషయమై మీనమేషాల్లెక్కెడుతున్నవారికి.. ఇప్పుడిక పూర్తి స్వేచ్ఛ దొరికేసినట్లే.!