జనం మాస్కులు వేసుకోకపోతే వెయ్యి రూపాయల జరీమానా.. మరి, జనం కోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న అధికారుల పరిస్థితేంటి.? వాళ్ళుగనుక ‘మాస్కులు లేవు’ అని అడిగితే, ‘వేటు’ పడటం ఖాయం. ఇదీ, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. మొన్న విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రి వైద్యుడు సుధాకర్, ఆసుపత్రుల్లో మాస్కులు లేకపోవడంపై స్పందిస్తే, టీడీపీకి లింకు అంటగట్టి ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం.
తాజాగా, చిత్తూరు జిల్లా నగిరి మునిసిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిపైనా వేటు పడేలా వుంది. ఎందుకంటే, ఆయనా అదే ‘పెద్ద’ తప్పు చేశారు. ప్రజల కోసం పనిచేస్తున్న తమకు మాస్కులు అందించడంలేదనీ, అయినాసరే నగిరిలో పోలీసులు, అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారనీ, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదని వాపోతూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
రాష్ట్రంలో అన్ని చోట్లా పరిస్థితి ఇలాగే వుందని చెప్పలేంగానీ, చాలా చోట్లు వైద్యులకు సరిపడా ‘ప్రొటెక్షన్’ కిట్స్ వుండడంలేదన్నది నిర్వివాదాంశం. ఇటీవల గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చెందిన ఓ వైద్యుడు, తమకు మాస్కుల కొరత వుందనీ, ఈ పరిస్థితుల్లో ప్రజలకు వైద్యం చేయడం చాలా కష్టంగా మారిందని వాపోవడమే కాదు, దాతలు ఆదుకోవాలంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ వ్యవహారంపై ఆ నోటా ఈనోటా సమాచారం తెలుసుకున్న సినీ నటుడు నిఖిల్, తనకు చేతనైన స్థాయిలో సాయం చేశాడు. మరికొందరు దాతలూ ముందుకొచ్చారు. అయినా, వైద్యులకు ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ లేకుండా వైద్యం ఎలా చేస్తారు.? ఈ మాత్రం ఇంగితం లేకుండా ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది.?
అవును మరి, అధికార పార్టీ నేతలు జనంలో విచ్చలవిడిగా తిరిగేస్తూ, ఈ క్రమంలో మాస్కుల్ని అడ్డగోలుగా వినియోగిస్తున్నారు. పోనీ, అవన్నా సక్రమంగా వినియోగిస్తున్నారా.? అంటే, ఫొటోలకు పోజులివ్వాల్సిన క్రమంలో వాటిని తీసి పక్కన పడేస్తుండడం గమనార్హం.
ఓ పక్క కరోనా దెబ్బకి జనం పిట్టల్లా రాలిపోతోంటే, అధికార పార్టీ నేతలకు ‘రిబ్బన్ కటింగులు’ అవసరమయ్యాయి. మంత్రుల తీరు మరీ దారుణంగా తయారైంది. తాము ఎదుర్కొంటోన్న దుస్థితిని అధికారులు చెప్పుకుంటోంటే, వారిపై ‘వేటు’ వేసి, చేతులు దులుపుకుంటోంది వైఎస్ జగన్ సర్కార్. పారాసిటమాల్ చాలు.. బ్లీచింగ్ పౌడర్ చల్లితే మేలు.. అని ముఖ్యమంత్రి మొదట్లో సెలవిచ్చారుగానీ.. ఆ నిర్లక్ష్యం ఖరీదు ఇప్పుడు 400 దిశగా దూసుకుపోతున్న కరోనా పాజిటివ్ కేసులు.. వాటిల్లో ఇప్పటికే సంభవించిన ఆరు మరణాలూ.!
April 7 : డాక్టర్స్ కు మాస్కులు ఇవ్వట్లేదని దళిత డాక్టర్ సుధాకర్ ఆవేదన. April 8 : ప్రభుత్వానికి వ్యతిరేకం గా మాట్లాడాడని దళిత డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం. April 9 : ఈ వీడియో లో వున్నది చిత్తూరు జిల్లా నగరి మునిసిపల్ కమీషనర్ వెంకట్రామిరెడ్డి. ప్రభుత్వం నుండి మాకు చిల్లి గవ్వ రాలేదు, మాకు మాస్కులు ఇవ్వలేదు, బూట్లు, గ్లోవ్స్ ఇవ్వలేదు అంటున్నారు..
Geplaatst door VK Ramabrahmam Kaza op Donderdag 9 april 2020