తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu) ‘యువగళం’ పాదయాత్ర విజయోత్సవ సభలో వైసీపీ ప్రభుత్వం పై విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలో ఎంతోమంది ఎన్నోసార్లు పాదయాత్ర చేశారని, వాటికి ఏ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించలేదని వైసీపీ ప్రభుత్వం ఆ పేరుని మూటగట్టుకుందని మండిపడ్డారు. విజయోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
‘ 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో పాదయాత్రలు చూశాను. నేను కూడా పాదయాత్ర, బస్సు యాత్ర చేశాను. ఎప్పుడూ పాదయాత్ర పై దండయాత్రలు చేసిన సందర్భాలు లేవు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం లోకేష్ పాదయాత్రకి అడుగున అడ్డంకులు సృష్టించింది. పవిత్రమైన భావనతో పాదయాత్ర చేస్తున్నప్పుడు వీలైతే దానికి సహకరించాలి లేదా మిన్నకుండాలి. ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డుగా పెట్టుకుని ఇబ్బందులకు గురిచేసింది. పాదయాత్ర వాలంటీర్ల పై కేసులు పెట్టి జైలుకు పంపింది. వీటన్నింటిని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం. ‘యువగళం’ ప్రజా గర్జనకు నాంది పలికింది’.
‘ఆంధ్రాలోని ప్రతి ప్రాంతం వైసీపీ నేతల చేతుల్లో నలిగిపోతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఆ పార్టీ నాయకుల చెరలో చిక్కుకుంది. ఆర్థిక రాజధానిగా పేరొందిన విశాఖ.. గంజాయి రాజధానిగా మారిపోయింది. జగన్ కి ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది. ఋషికొండ ని తవ్వి సీఎం నివాసానికి 500 కోట్లు వెచ్చించే అధికారం ఎవరిచ్చారు?. రాజధానిని మూడు ముక్కలు చేసి తలోదిక్కు పడేశారు. అబద్ధాల పునాదులపై నిర్మితమైన ఆ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ విముక్తి కలగాలి’ అని అన్నారు.
అమరావతి , తిరుపతి లో సభలు
త్వరలో అమరావతి, తిరుపతిలో సభలు పెట్టి ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటిస్తాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, యువతకు నెలకి3 వేల రూపాయల నిరుద్యోగ భృతి కల్పిస్తాం. 20 లక్షల మందికి ఉపాధి కల్పించేలా బాధ్యత తీసుకుంటాం. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తాం. అన్నదాత పేరుతో రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం’ అని చంద్రబాబు తెలిపారు.