బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth)ని బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఫైనల్ అనంతరం జరిగిన దాడి కేసులో ప్రశాంత్, అతడి సోదరుడు మహావీర్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రశాంత్ ని A1 గా, అతని తమ్ముణ్ని A2 గా చేర్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దాదాపు 6 గంటల పాటు విచారించిన పోలీసులు.. బుధవారం రాత్రి ప్రశాంత్ ని అతని సోదరుడిని జడ్జ్ ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి వీరిద్దరికి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. దీంతో వీరిద్దరిని రాత్రి పోలీసులు చంచల్ గూడా జైలుకు తరలించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కేసులో వీరిద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
గత ఆదివారం బిగ్ బాస్ ఫైనల్ అనంతరం ప్రశాంత్ విన్నర్ గా నిలిచిన తర్వాత స్టూడియో నుంచి బయటకు వచ్చే క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శాంతిభద్రతల నేపథ్యంలో ప్రశాంత్ ని మరో దారిలో రావాలని పోలీసులు సూచించగా అతడు నిరాకరించాడు. అక్కడే ఉన్న మరో కంటెస్టెంట్ అశ్విని కారుపై కొందరు రాళ్లదాడి చేయగా పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఏసీపి వాహనంతో సహా ఆర్టీసీ బస్సు అద్దాలను పగలగొట్టారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మెహర్ రాకేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రశాంత్ పై 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.