‘రాష్ట్రానికి తానే ఆఖరి ముఖ్యమంత్రిలా జగన్ ప్రవర్తిస్తున్నారు. అందుకే ఆస్తులన్ని అమ్మేయడం.. తాకట్టు పెట్టడం చేస్తున్నారు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా దిగిజారిపోయాయి.
వైసీపీ నేతలు కోటీశ్వరులవుతుంటే.. పేదలు నిరుపేదలవుతున్నారు. 66 ఏళ్లలో ఏపీ 3లక్షల కోట్ల అప్పు చేస్తే.. ఇప్పుడు 7లక్షల కోట్లకు చేరింది. రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై 5-6 లక్షల అప్పు ఉంది. కలెక్టరేట్, రెసిడెన్సియల్ స్కూళ్లు, పార్కులు తాకట్టు పెడుతున్నారు.. ఇకపై రోడ్లు తాకట్టు పెడతారేమో..’.
‘దేశంలో పెట్రోల్ డీజిల్, గ్యాస్, లిక్కర్, కరెంట్ చార్జీలు ఏపీలోనే ఎక్కువ. చెత్త, మరుగుదొడ్లపై పన్ను వేస్తున్నారు. ధైర్యం ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రజలు, ఉద్యోగులు ఆలోచించాలి.. చైతన్యం రావాలి. 2లక్షల కోట్ల సంపద గల అమరావతిని నాశనం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన జగన్ను చరిత్ర క్షమించదు’ అని చంద్రబాబు అన్నారు.