లక్షలాది మంది అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. వేలాది పాటలు పాడిగ గాత్రం మూగబోయింది. గానగంధర్వుడు మరలిరాని లోకానికి వెళ్లిపోయారు. 55 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నేపథ్య గాయకుడు, నటుడు, నిర్మాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో పది మంది వైద్య నిపుణుల పర్యవేక్షణలో అత్యంత నాణ్యమైన చికిత్స అందించినా ఆయన్ను కాపాడలేకపోయారు.
కరోనా నిర్ధారణ కావడంతో గతనెల 5న చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన బాలు ఆరోగ్య పరిస్థితి క్రమంగా విషమించింది. ఈ నేపథ్యంలో ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించిన వైద్యులు.. అనంతరం ఎక్మో సపోర్ట్ తో చికిత్స చేశారు. ఈ క్రమంలో బాలు కరోనా నుంచి కోలుకున్నారు. నెమ్మదిగా ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది. దీంతో త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి అవుతారని అందరూ భావించారు. అయితే, గురువారం సాయంత్రం బాలు ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. రాత్రికి అది మరింత విషమంగా మారింది.
నిపుణులైన వైద్యులు అన్ని రకాలుగా ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు. చివరకు శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు బాలు తుది శ్వాస విడిచారు. గురువారం సాయంత్రమే బాలు ఆరోగ్యం విషమంగా మారిందని తెలియడంతో అభిమానులతోపాటు సినీ ప్రముఖులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. కమల్ హాసన్ ఆస్పత్రికి వచ్చి బాలు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇక శుక్రవారం ఉదయం నుంచి ఎంజీఎం ఆస్పత్రికి అభిమానులు పోటెత్తారు. బాలు కోలుకుని రావాలని ప్రార్థనలు చేశారు. కానీ అందరికీ తీరని శోకం మిగులుస్తూ బాలు తరలిరాని లోకానికి వెళ్లిపోయారు.
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేటలో జన్మించారు. తండ్రి సాంబమూర్తి హరికథా కళాకారుడు కాగా, తల్లి శకుంతలమ్మ గృహిణి. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కలిగిన పెద్ద కుటుంబంలో బాలు రెండో కుమారుడు. బాల్యం నుంచే బాలుకు పాటలపై మక్కువ ఎక్కువ. అయితే, ఇంజనీర్ కావాలనే తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు మద్రాసు ఏఎంఐఈ కోర్సులో చేరారు. ఆ సమయంలోనే పలు పాటల పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. 1966లో పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. అక్కడ నుంచి వెనుతిరిగి చూడలేదు.
నటీనటుల హవభావాలు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడటం బాలుకు మరింత ప్రత్యేకత తెచ్చిపెట్టింది. గాయకుడిగానే కాకుండా నటుడిగానూ పలు పాత్రల్లో మెప్పించారు. 1969లో తొలిసారిగా తెరపై కనిపించిన బాలు.. తర్వాత పలు సినిమాల్లో నటించారు. ప్రేమ, ప్రేమికుడు, పవిత్రబంధం, ఆరోప్రాణం, రక్షకుడు, దీర్ఘసుమంగళీభవ వంటి చిత్రాల్లో చక్కని పాత్రలు పోషించారు. ప్రేమికుడు సినిమాలో ప్రభుదేవాతో కలిసి బాలు వేసిన స్టెప్పులు అభిమానులను అలరించాయి. తనికెళ్ల భరణి నిర్మించిన మిథునం చిత్రంలో కథానాయకుడిగా నటించారు. గాయకుడు, నటుడిగానే కాకుండా డబ్బింగ్ కళాకారుడిగా ఎందరో నటులకు గాత్రం అందించారు.
సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపైనా బాలు ఎందరినో అలరించారు. పాడుతా తీయగా.. పాడాలని ఉంది వంటి కార్యక్రమాల ద్వారా పలువురునూతన గాయనీ గాయకులను పరిచయం చేశారు. తన గానంతో ఎందరినో ఉర్రూతలూగించిన బాలును ఎన్నో పురస్కారాలు వరించాయి. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాలతో కేంద్రం సత్కరించింది. వివిధ విభాగాల్లో 29 సార్లు ఏపీ ప్రభుత్వం అందజేసే నంది అవార్డు లభించింది.
అలాగే తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల నుంచి పలు అవార్డులు వచ్చాయి. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 11 భాషాల్లో 40వేలకు పైగా పాటలు పాడారు. 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. బాలు సతీమణి సావిత్రి. వీరి పిల్లలు పల్లవి, చరణ్. బాలు కరోనాతో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి చరణ్ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య సమాచారాన్ని అభిమానులకు తెలియజేస్తూ వస్తున్నారు.
711619 570938hey good site i will definaely come back and see once again. 36091