కాకినాడలో జనసేన పార్టీకి చెందిన మహిళా నేతలు, కార్యకర్తలపై వైసీపీ రౌడీలు దాడులు చేశారు.. ఆ దాడులకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చినాగానీ, ఆ ఘటనలో దోషులకు శిక్షలు పడలేదు. పైగా, ఆ ఘటనలో జనసేన పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదవడం అప్పట్లో పెను రాజకీయ దుమారానికి కారణమయ్యింది.
ఇది మొబైల్ ఫోన్ల యుగం.. సీసీటీవీల యుగం.! విశాఖ విమానాశ్రయం దగ్గర వైసీపీకి చెందిన నేతలు, అందునా మంత్రుల మీద జనసైనికులు దాడులు చేశారనే ఆరోపణలు వచ్చాయి. కానీ, ఎక్కడ.? ఒక్కటంటే ఒక్క వీడియో కూడా దాడులకు సంబంధించి బయటకు రాలేదు.
‘అన్నిటికీ ఆధారాలున్నాయి. మా వాళ్ళు మొబైల్ ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీశారు. సీసీటీవీ ఫుటేజ్ వుంది.. ఎవడ్నీ వదలం..’ అంటూ మంత్రి రోజా ఘనంగా ప్రకటించేసుకున్నారు. అధికార పార్టీ అనుకూల మీడియాలో ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ఫొటో, ఒక్క వీడియో కూడా కనిపించలేదు దాడులకు సంబంధించి. ఓ వ్యక్తికి చిన్న గాయమైనట్లుగా చూపిస్తున్నారు తప్ప, జనసైనికులు దాడి చేసినట్లుగా చూపించలేకపోతున్నారు.
మరి, అరెస్టులు ఎలా జరుగుతున్నాయి.? విశాఖ ఎయిర్పోర్టుకు వెళ్ళేందుకు ప్రయాణీకులకు ఇబ్బంది కలిగింది.. పలువురు ప్రయాణీకులు సకాలంలో విమానాశ్రయానికి చేరుకోలేకపోయారు.. అంటూ పోలీసులు ఆరోపిస్తున్నారు. అదే అధికార పార్టీ నాయకులు ‘షో’ చేస్తే, తద్వారా సామాన్య పౌరులకు కలిగే ఇబ్బందులపై పోలీసులు ఏనాడైనా కేసులు నమోదు చేశారా.? అన్నది జనసైనికుల ప్రశ్న.
మంత్రుల్ని జనసైనికులు దూషించారనీ పోలీసులు చెబుతున్నారు. రాజకీయాల్లో దూషణలు ఎంత సర్వసాధారణమైపోయాయో పోలీసులకు తెలియదా.? మంత్రిగా వున్నప్పుడు కొడాలి నాని చేసిన దూషణల మాటేమిటి.? ఇప్పటికీ పలువురు మంత్రులు మాట్లాడటం మానేసి దూషణలతోనే సరిపెడుతున్నారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యల వ్యవహారానికొస్తే, ముందుగా వైసీపీ నాయకుల్నే పోలీసులు అరెస్టు చేయాల్సి వుంటుందేమో.! అంతలా నిన్నంతా వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేవారు.. అదీ జనసేన మీద. ఫలానా జనసేన నేత రెచ్చగొట్టేలా వ్యవహరించారనడానికీ సాక్ష్యం చూపించలేకపోతోంది అధికార పార్టీ. దానర్థమేంటి.? అరెస్టులు చేయించి.. ఆ తర్వాత ఆధారాల కోసం వెతుక్కోవడంమనే బులుగు రాజ్యాంగం షరామామూలుగానే అమలవుతోందన్నమాట.. అన్నది జనసైనికుల అనుమానం.