APSRTC: విజయవాడ (Vijayawada) డిపోకు చెందిన ఆర్టీసీ (APSRTC) బస్ (AP 16Z 0702) డ్రైవరుపై కావలికి చెందిన కొందరు దాడి చేయడం కలకలం రేపింది. బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్న బస్ డ్రైవర్ బి.రాంసింగ్ పై ఓ కారు డ్రైవర్, అనుచరులు దాడి చేస్తున్న దృశ్యాలు నెట్టింట వైరలయ్యాయి. దీనిపై ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమల రావు స్పందించారు. ప్రజల మధ్య విధులు నిర్వహించే కార్మికులపై దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. ఇప్పటికే వారిపై ఐపీసీ చట్టం కింద కేసులు నమోదయ్యాయన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కావలిలోని ట్రంకు రోడ్డులో దారిలో అడ్డంగా ఉన్న బైక్ తీయాలని రాంసింగ్ హారన్ మోగించాడు. దీంతో బైకర్ వాదనకు దిగడంతో డ్యూటీ పోలీసులు సర్ధిచెప్పి పంపించారు. బైకర్ ఈ విషయాన్ని కొందరికి చెప్పడంతో.. 14మందితో బస్సును వెంబడించి పట్టణ శివారలోని మద్దూరుపాటు వ్యవసాయ మార్కెట్ వద్ద అడ్డగించారు. డ్రైవర్ ను దుర్భాషలాడి తీవ్రంగా గాయపరిచారు. దృశ్యాలు చిత్రీకరిస్తున్న ఓ వ్యక్తి మొబైల్ ను సైతం ధ్వంసం చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాంసింగ్ ను ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.