వావ్.! అసలు ఇలాంటి ఆణిముత్యాల్లాంటి ఆలోచనలు అమాత్యులకు ఎలా వస్తాయ్.? పైగా మహిళా హోం మంత్రి.. అమ్మాయిలపై అఘాయిత్యాలకు కారణం తల్లుల నిర్లక్ష్యమేనని సెలవిస్తే, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ‘బయట పనుల కోసం వెళ్ళే తల్లుల నిర్లక్ష్యం వల్లే అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయ్..’ అని హోంమంత్రి తానేటి వనిత చేసిన వ్యాఖ్యలిప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి.
తల్లి పొత్తిళ్ళలోని చిన్నారి నుంచి కాటికి కాలు చాపిన ముదుసలి వరకు.. అన్ని వయసుల వారూ అత్యాచార బాధితుల్లో వుంటున్నారు. మరి, అరవయ్యేళ్ల వృద్ధురాలిపై అత్యాచారం ఏ తల్లి నిర్లక్ష్యం వల్ల జరుగుతోంది హోంమంత్రి తానేటి వనిత వివరణ ఇస్తే బావుంటుంది.
వేల కేసులుంటే.. అందులో ఒకటో రెండో కేసుల్లో దోషులకు శిక్ష పడుతుంది.. ఆ శిక్షకే తమ ఘనత అని పాలకులు చెప్పుకోవడం చూస్తున్నాం. అతీ గతీ లేని దిశ బిల్లుని.. దిశ చట్టంగా ప్రచారం చేసుకోవడంలో అధికార పార్టీ పడుతున్న పబ్లిసిటీ పాట్లు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ముఖ్యమంత్రి నివాసానికి కూత వేటు దూరంలోనే ఓ యువతిపై గతంలో అత్యాచారం జరిగింది.. అదీ ఆమెకు కాబోయే భర్త సమక్షంలో అత్యంత పాశవికంగా లైంగిక దాడి జరిగింది. విజయవాడలో ఓ మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి ఘటనలు జరుగుతూనే వున్నాయి.
ప్రతిసారీ అధికారంలో వున్నవారు రాజకీయం చేయడం వల్లే నేరస్తులకు భయం లేకుండా పోతోందన్నది నిర్వివాదాంశం. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలి. కూలి పనుల దగ్గర్నుంచి హోంమంత్రుల వరకు మహిళలు ఎదుగుతున్నారు. అలా కుదరదు.. తమ బిడ్డల్ని కాపాడుకోడానికి ఇంటి దగ్గరే వుండాలి.. అని హోం మంత్రి హోదాలో ఓ మహిళ చెబుతోంటే, ఇక రాష్ట్రంలో మహిళలకు భద్రత గాల్లో దీపమే.!