APSRTC: కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకంపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం (AP GOVERNMENT) దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లో విశేష స్పందన వస్తున్న పథకాన్ని తొలుత తెలుగుదేశం పార్టీ.. తాము అధికారంలోకి వస్తే ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) బస్సుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఇప్పుడు జగన్ ప్రభుత్వం దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించి త్వరలోనే అమలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై అధికారులు ఇప్పటికే సాధ్యాసాధ్యాలపై నివేదిక సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.
మహిళలకు ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణం తీసుకొస్తే.. ఏఏ బస్సుల్లో ప్రయాణానికి అనుమతి ఇవ్వాలి.. ఏ వయసు వారికి.. రోజువారీ ప్రస్తుత ఆర్టీసీ ఆదాయం.. పథకం అమల్లోకి వస్తే రోజుకెంత నష్టం అనే అంచనాలు ఆర్టీసీ అధికారులు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే.. మహిళలకు ఉచిత ప్రయాణం పథకం సక్సెస్ కావడంతో తెలంగాణ రాష్ట్రంలో బస్సుల సంఖ్య పెంచుతోంది. మరోవైపు తమ ఆదాయానికి గండి పడుతోందని రెండు రాష్ట్రాల్లోని ఆటో డ్రైవర్లు నిరసనలు కూడా వ్యక్తం చేశారు.