Ajeya Kallam: ఇందులో దాపరికానికి అవకాశమేమీ లేదు. ‘చిట్ చాట్’ అని మాజీ సీఎస్ అజేయ కల్లాం చెప్పినా, సీబీఐ విచారణ.. తీగ లాగుతున్న దర్యాప్తు సంస్థ.. అంటూ మీడియాలో కథనాలు వస్తున్నా.. జరుగుతున్న విషయాలన్నీ స్పష్టంగానే కనిపిస్తున్నాయ్ అందరికీ.!
మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుకు సంబంధించి, ఎస్పీ స్థాయి అధికారి ఒకరు మాజీ చీఫ్ సెక్రెటరీ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజేయ కల్లాంని విచారించిన వైనం, టీడీపీ అనుకూల మీడియాలో స్పష్టంగా వచ్చేసింది. ఏయే వివరాల్ని ఆయన సీబీఐకి చెప్పారన్నదానిపై చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన పాత్రికేయుడు రాధాకృష్ణ వేమూరి, తన మీడియా సంస్థ ద్వారా ప్రచారంలోకి తెచ్చారు.
సరే, ఆర్కే కొన్ని మాటల్ని ‘మసాలాగా’ అసల విషయానికి దట్టించి వుండొచ్చు. అది అజేయ కల్లాంకి నచ్చకపోయి వుండొచ్చు. అది వేరే సంగతి. ‘సీబీఐ అధికారులకు వివరంగా అన్నీ చెబితే, అవెలా లీక్ అయ్యాయో నాకు అర్థం కావట్లేదు..’ అని అజేయ కల్లాం చెప్పడంతో, ఏబీఎన్ ఆర్కే కథనం నిజమేనని, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సర్టిఫై చేసినట్లయ్యింది.
వక్రీకరణలున్నాయని అజేయ కల్లాం చెప్పడమూ ఇక్కడ ప్రస్తావనార్హం. అయినాగానీ, వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయారని వైఎస్ జగన్ తమతో చెబితే, ‘ఎప్పుడు.? ఎలా జరిగింది.?’ అని అజేయ కల్లాం అడగకపోవడమేంటో.? పైగా, ఆ సమయం గుర్తు లేదని చెప్పడమేంటో.!
అజేయ కల్లాం ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో పని చేస్తున్నారు. సలహాదారుగా ఆయనకు ప్రత్యేకమైన గౌరవం ఇస్తున్నారు వైఎస్ జగన్. అలాంటి వ్యక్తి సీబీఐ విచారణ ఎదుర్కొంటుండడం.. పైగా, వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో కావడం.. ఇదంతా చూస్తోంటే ఏమనిపిస్తోంది.?
ఆర్కే లీక్స్ కాస్తా, వైసీపీలో పెను ప్రకంపనలకు కారణమవుతోందన్నమాట. కల్లాంతో ప్రెస్ మీట్ పెట్టించి వైసీపీ పెద్ద తప్పు చేసినట్లే వుంది.!