YSRCP: అదేంటో, నిజం అబద్ధంగా చూపబడుతుంది. అబద్ధమేమో నిజంగా మార్చబడుతుంది.! వైసీపీ కళ్ళతోనే ఏదైనా చూడాలి.! వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైతే, దాన్ని గుండె పోటుగానే చూడాలి.!
ఎందుకంటే, తొలుత వైసీపీ ఈ విషయాన్ని అలాగే జనానికి చూపించింది. కానీ, అది హత్య అని తేలాక, నారాసుర రక్త చరిత్రగా చూపించే ప్రయత్నం చేసింది వైసీపీ. అదీ కుదరకపోవడంతో, అక్రమ సంబంధాలే హత్యకు కారణమంటూ కొత్త కథ అల్లింది వైసీపీ.
ఇది మచ్చుకు ఓ చిన్న ఉదాహరణ మాత్రమే.! ప్రత్యేక హోదా విషయంలో కావొచ్చు, సీపీఎస్ రద్దు, మద్యనిషేధం విషయంలో కావొచ్చు.. దేని మీద అయినా వైసీపీది ఒకటే సిద్ధాంతం.. నిజమే అబద్ధం.. అబద్ధమే నిజం.!
జనసేన పార్టీ ఎన్నికల గుర్తు విషయంలో రాద్ధాంతం జరుగుతోంది. ఎన్నికల కమిషన్ స్పష్టంగా పేర్కొంది, జనసేన పార్టీకి కామన్ సింబల్ వుందనీ, అది గ్లాసు గుర్తు మాత్రమేనని. కానీ, వైసీపీ దుష్ప్రచారం వేరేలా వుంది. జనసేనకు కామన్ సింబల్ పోయిందన్నది వైసీపీ చేస్తున్న ప్రచారం.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మీడియా లేదట. ఆయనేమో పేదోడట.! మరి, సాక్షి సంగతేంటి.? ఆ సాక్షికి ప్రభుత్వం ఇస్తున్న వందల కోట్ల విలువైన ప్రకటనల సంగతేంటి.? అసలు పేదిరకమంటే అర్థమేంటి.? నిజమే అబద్ధం.. అబద్ధమే నిజం.! ఈ పేదరికం విషయంలోనూ అంతే.
బకాయిల కారణంగా ఆరోగ్యశ్రీ సేవలు అందించలేమని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ప్రైవేటు ఆసుపత్రులు తేల్చి చెప్పాయి. ఈ విషయమై జనసేన పార్టీ స్పందించింది. తక్షణం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వమూ ఆదరాబాదరాగా కొంతమేర బకాయిలు చెల్లించక తప్పలేదు. ఇంకా బకాయిలున్నాయని ప్రభుత్వమే పేర్కొంటోంది.
ఇంతలోనే, విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన.! ఏది దుష్ప్రచారం.? ఏది వాస్తవం.? జనాన్ని ఇంకెన్నాళ్ళిలా మభ్యపెట్టి మాయ చేస్తారు.? రాజధాని అమరావతిని స్మశానమనీ, ఎడారి అనీ, ముంపు ప్రాంతమనీ పేర్కొని.. ఇప్పుడక్కడ పేదలకు ఇళ్ళు ఇవ్వడం గొప్ప కార్యక్రమంగా వైసీపీ చెబుతోంది.
స్మశానం కదా.? ఎడారి కదా.? ముంపు ప్రాంతం కదా.? అక్కడెలా పేదలకు భూముల్ని ఇస్తారుట.? అలాగని ఎవరైనా ప్రశ్నిస్తే ఎదురుదాడి.? వైసీపీ చెబితే స్మశానం.. వైసీపీ చెబితే అది పేదలకు అనువైన ప్రాంతం. వైసీపీ చెబితే గుండె పోటు.. అదే వైసీపీ మళ్ళీ చెబితే అది దారుణ హత్య.! వైసీపీ చెబితే వాస్తవం. అదే మాట వైసీపీ ఇంకోసారి చెబితే దుష్ప్రచారం.!
మొత్తంగా చూస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పూర్తిస్థాయి అయోమయంలోకి నెట్టేయడం.. అంతా తమ కళ్ళతోనే చూడాలన్న మోనార్కిజం.. ఇవన్నీ వైసీపీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నిజమేమో అబద్ధంగా.. అబద్ధమేమో నిజంగా మార్చబడుతోందంటే.. వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయని అర్థం.! ఇది అత్యంత ప్రమాదకరం.! విషపూరిత నైజం.!