ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళుతోంటే, రాష్ట్రం పరువు పోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ ఇదే పరిస్థితి. ఢిల్లీ పెద్దలకు ఎందుకో ‘ఆంధ్రప్రదేశ్’ ముఖ్యమంత్రి అంటే అదో చిన్న చూపు. టీడీపీ – బీజేపీ పొత్తు పెట్టుకున్నా పరిస్థితి మారలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా దాదాపు 30 సార్లు ఢిల్లీకి వెళ్ళినా కేంద్రం, రాష్ట్రాన్ని పట్టించుకోలేదట. ఈ విషయాన్ని సాక్షాత్తూ చంద్రబాబే చెప్పుకున్నారు. చంద్రబాబుకి ఢిల్లీ టూర్లో అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయని అప్పట్లో సాక్షి నానా యాగీ చేసింది.
ఇప్పుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళితే.. ‘ఎక్కే గుమ్మం దిగే గుమ్మం..’ తప్ప, ఆయన్ని ఎవరూ పట్టించుకోలేదని టీడీపీ అనుకూల మీడియా కథనాల్ని వండి వడ్డిస్తోంది. అంటే, ఇక్కడ మేటర్ క్లియర్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఢిల్లీలో ‘పిసరంత’ విలువ కూడా లేదన్న మాట. ‘అబ్బే, జగన్ ఢిల్లీ టూర్ అద్భుతంగా సాగింది..’ అని వైసీపీ చెప్పుకుంటోంది..
గతంలో టీడీపీ చంద్రబాబు టూర్ గురించి గొప్పగా చెప్పుకున్నట్లు. వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ విజయవంతమైతే, అమిత్ షాతో కలిసి వైఎస్ జగన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వుండేవారే. ఢిల్లీకి వైఎస్ జగన్ వెళ్ళారు.. వచ్చారు. అంతే, కేంద్రం నుంచి రాష్ట్రానికి సంబంధించి ఒక్క సానుకూల ప్రకటన కూడా జగన్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో రాలేదు. చంద్రబాబే నయ్యం.. ముందస్తుగా ఏదో ఒకటి ప్లాన్ చేసుకుని, ఆ ఘనతను తన ఢిల్లీ టూర్ ఖాతాలో వేసేసుకునేవారు. జగన్కి ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయినట్లుంది.
రాష్ట్ర ప్రయోజనాల విషయమై కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు జగన్ టూర్.. అని అంతా అనుకున్నారుగానీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి మాత్రమేనని జనం అనుకోలేదంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఒక్కటి మాత్రం నిజం.. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరువు మనమే తీసుకుంటున్నాం. ‘మనం’ అంటే.. మన రాజకీయ పార్టీలన్నమాట. టీడీపీ, వైసీపీ సహా అన్ని రాజకీయ పార్టీలూ ఇందుకు బాధ్యత వహించాల్సిందే.