అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద దాడి సాధ్యమా.? ఛాన్సే లేదు.
ఆయనేమీ సాదా సీదా రాజకీయ నాయకుడు కాదు. ముఖ్యమంత్రి.! వందల మంది భద్రతా సిబ్బంది వుండగా, వైఎస్ జగన్ మీదకు రాయి దూసుకెళ్ళడం అనేది ఓ మిస్టరీగా మారింది. రాయి దొరకలేదు.. రాయి విసిరినోడూ ఇంతవరకూ దొరకలేదు. పోలీసు శాఖ ఈ ఘటనపై ముందు ముందు ఎలా స్పందిస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఈ మొత్తం వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెనాలి ఎన్నికల ప్రచారంలో స్పందించారు. ‘నాన్నా పులి కథలోలా ఇలాంటివి మొదటి సారి జనం నమ్ముతారేమో.. ఆ తర్వాత నవ్వుతారు..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
‘ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది కదా.! స్పందించాలంటూ అత్యంత సన్నిహితులు కోరారు. ఏమని స్పందిస్తాం.? జరిగిన ఘటన నిజమో కాదో తెలియాలి కదా.?’ అంటూ వారికి తాను చెప్పానని పవన్ కళ్యాణ్ అన్నారు. అదీ నిజమే మరి.!
గతంలో కోడి కత్తి ఘటన.. ఆ తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య.! ఈ నేపథ్యంలో ఇప్పుడీ గులక రాయి ఘటన తర్వాత, ఎలాంటి దారుణం జరగబోతోందనన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. అదే అనుమానం, ఆందోళన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తం చేశారు.
నిన్నటి పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన, ఈ సందర్భంగా ఆయా అంశాలపై జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. వాలంటీర్ల గురించి కావొచ్చు, సీపీఎస్ రద్దు గురించి కావొచ్చు, ఉద్యోగుల జీతాల గురించి కావొచ్చు.. అన్ని విషయాల గురించీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా చాలా స్పష్టంగా మాట్లాడారు.
వాలంటీర్లకు ఐదు వేలు గౌరవ వేతనం ఇచ్చి, వైసీపీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారన్న జనసేనాని, తాము అధికారంలోకి వస్తే, వారిలోని నైపుణ్యాల్ని అభివృద్ధి చేసి, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని జనసేనాని అన్నారు.
దాంతో, వాలంటీర్లకు ఇప్పటిదాకా కమ్మేసిన వైసీపీ పొరలు కూడా తొలగిపోయినట్లయ్యింది.