BCCI: పట్టణీకరణ పేరుతో చెట్లను ఇష్టారీతన నరికేస్తూండటంతో మన పరిసరాలు కాంక్రీట్ జంగిల్ గా మారుతోందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పర్యావరణంపై అవగాహన పెంచేందుకు బీసీసీఐ (BCCI) వినూత్న ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు ఎంతో పేరున్న ఐపీఎల్ (IPL) క్రికెట్ మ్యాచ్ లను ఉపయోగించుకుంది.
ఐపీఎల్-2023 (IPL-2023) ప్లేఆఫ్స్ లో ఒక్కో డాట్ బాల్ కు 500 మొక్కలు నాటుతామని ప్రకటించింది. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) -గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) మొదటి క్వాలిఫైయర్ లో 84, ముంబై ఇండియన్స్-లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఎలిమినేటర్ మ్యాచ్ లో 96, గుజరాత్-ముంబై రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లో 67, చెన్నై-గుజరాత్ ఫైనల్లో 45 డాట్ బాల్స్ నమోదయ్యాయి.
దీంతో 292 డాట్ బాల్స్ కు గానూ.. 292×500 లెక్కన మొత్తం 1,46,000 మొక్కలు నాటనుంది. బీసీసీఐ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ఎక్కువగా డాట్ బాల్స్ నమోదు చేసిన బౌలర్లలో మహ్మద షమీ, ఆకాశ్ మద్వాల్, మతీశా, రషీద్ ఖాన్ ఉన్నారు.