ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే అలియాస్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి, వైఎస్ షర్మిలతోనే ఇకపై తన రాజకీయ ప్రయాణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో వైఎస్ షర్మిల, ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’ నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా వైఎస్ షర్మిల పావులు కదుపుతున్నారు. కర్నాటక నుంచి రాజ్యసభ సభ్యత్వం కల్పించడంతోపాటు, ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఆమెకు కాంగ్రెస్ అవకాశం కల్పించబోతోంది.
ఈ క్రమంలో వైసీపీలో అసంతృప్త నేతలు వైఎస్ షర్మిల వైపు కూడా చూస్తుండడం గమనార్హం. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీల్లోకి పలువురు వైసీపీ నేతలు జంప్ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ ఇటీవలే జనసేన పార్టీలో చేరారు. టీడీపీలోకి పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు చేరుతున్నారు.
ఇక, జనసేన అలాగే టీడీపీలోకి వెళ్ళలేని నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపో, బీజేపీ వైపో చూడాల్సిన పరిస్థితి.
ఇదిలా వుంటే, మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి 1200 కోట్లు వెచ్చిస్తామని గతంలో జగన్ చెప్పారనీ, 120 కోట్లు కూడా మంజూరు చేయలేదనీ, సొంత నియోజకవర్గం పులివెందులకు మాత్రం నిధులు కేటాయించుకుంటున్నారని ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
‘గతంలో టీడీపీ కూడా మంగళగిరిని అభివృద్ధి చేయలేదు. అదే తప్పు వైసీపీ కూడా చేస్తోంది. అందుకే, వైసీపీకి రాజీనామా చేశాను. ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి వైసీపీలోకి వెళ్ళే అవకాశమే లేదు. కాంగ్రెస్లోకి వైఎస్ షర్మిల వెళ్ళకపోతే, తదుపరి రాజకీయ కార్యాచరణ ఏంటన్నది ప్రకటిస్తాను..’ అని అన్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి.
తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందేననీ, ముఖ్యమంత్రికి సైతం ఈ విషయంలో మినహాయింపు వుండబోదని ఆళ్ళ రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం కొసమెరుపు. వైసీపీ అవినీతిని కూడా తాను ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.!