‘చంద్రబాబు కాళ్ళు పైకి, తలకాయ కిందకీ పెట్టినా.. విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవకుండా ఆపలేరు..’ అంటున్నారు వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. మంచిదే, ఎవరు కాదన్నారు.? ఎవరు అడ్డుకుంటున్నారు.? ఇదే అసలు సమస్య.!
మూడు రాజధానుల దిశగా వైసీపీ సర్కారు గతంలోనే నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో బిల్లు పెట్టింది, నానా తంటాలూ పడి, దాన్ని చట్టంగా చేసింది. కోర్టు చీవాట్లతో చట్టాన్ని వెనక్కి తీసుకుంది కూడా. సో, మూడు రాజధానుల అంశం ఇప్పుడెక్కడుంది.? ప్రస్తుతానికి వున్నదల్లా ఒకటే రాజధాని.. అదే అమరావతి.
నిజానికి, మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకోవడం ద్వారా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని పురిట్లోనే వైసీపీ సర్కారు చంపేసినట్లయ్యింది. ‘సమగ్రమైన బిల్లు తీసుకొస్తాం..’ అని అసెంబ్లీలో చెప్పేసి ఊరుకుంది వైసీపీ సర్కారు. అంతే, ఆ సమగ్రమైన బిల్లుకి ఎప్పుుడు మోక్షం కలుగుతుందో ఎవరికీ అర్థం కాని డైలమా షురూ అయ్యింది.
ఒక రాజధాని అమరావతి, కాస్తో కూస్తో అభివృద్ధి చెందితే, ఆ తర్వాత మరో రెండు.. కాదు, ఇరవై.. లేదూ, ఓ యాభై రాజధానులు కట్టుకున్నా ఎవరూ వద్దనరు. అసలంటూ ఒక్క రాజధాని అమరావతిని స్మశానంగా, ఎడారిగా అభివర్ణిస్తూ, మూడు రాజధానులనడమేంటి.? అందులో అమరావతి కూడా ఒకటని చెప్పడమేంటి.?
వైసీపీ సర్కారుకి, అసలు రాజధాని అనే అంశం పట్ల కాస్త కూడా చిత్తశుద్ధి లేదు, కనీసపాటి అవగాహన వున్నట్లు కూడా కనిపించడంలేదు. అందుకనే, అమరావతి అతీ గతీ లేకుండా పోయింది గడచిన మూడేళ్ళుగా. ఓ రాష్ట్ర ప్రభుత్వం, రాజధానిని పట్టించుకోకుండా వదిలేయడమనేది చరిత్రలో ఇప్పటిదాకా ఎప్పుడూ జరగలేదేమో.!
సరే, అమరావతి పేరుతో గతంలో చంద్రబాబు కుంభకోణమే చేశారనుకుందాం. ఆ కుంభకోణం బయటపెట్టాలి కదా.? దోచేసిన సొమ్ముని ముక్కుపిండి మరీ వసూలు చెయ్యాలి కదా.? అది చెయ్యకుండా అమరావతిని ఆపెయ్యడమేంటి.? పైగా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరు చెప్పి ఉత్తరాంధ్రుల్నీ, న్యాయ రాజధాని పేరు చెప్పి రాయలసీమ వాసుల్నీ రెచ్చగొట్టి వైసీపీ ఏం సాధించింది.? ఏం సాధిస్తుంది.?
చంద్రబాబు సంగతేమోగానీ, వైసీపీ తల్లకిందులుగా తపస్సు చేసినా, మూడు రాజధానులు జరిగే పని కాదని తేలిపోయింది కదా.!
516591 543116Which is some inspirational stuff. Never knew that opinions may well be this varied. Thank you for all the enthusiasm to provide such useful information here. 888044