మాజీ మంత్రి, ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి అకస్మాత్తుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి పోలీసుల రక్షణ కోరాడు. తనకు గన్ మెన్లను మార్చారని.. తన ప్రాణానికి తనకేమైనా జరిగితే సీఎం జగన్ దే బాద్యత అని అన్నాడు. ప్రభుత్వం నుంచి తనకు తగిన రక్షణ దక్కడంలేదని అన్నారు. తనకు సమాచారం ఇవ్వకుండానే గన్ మెన్లను మార్చారని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఎస్పీ పట్టించుకోవట్లేదని.. సీబీఐ ఏఎస్సీ రామ్ సింగ్ ఆదేశాలతోనే ఫిర్యాదు చేస్తున్నానని అన్నారు.
గన్ మెన్లను మార్చి వారం కావొస్తోందని ఎందుకు మార్చారని అడిగితే విజయవాడ నుంచి ఆదేశాలు వచ్చాయని అంటున్నారని అన్నారు. ఇప్పటికిప్పుడు తనకు గన్ మెన్లను ఎందుకు మార్చారనేది తనకు అర్ధం కావట్లేదని దస్తగిరి వాపోయాడు. తొండూరు మండల వైసీపీ నేతలు తనపై కేసులు పెట్టిస్తున్నారని కూడా దస్తగిరి చెప్పాడు. వారిపై తిరిగి కేసులు పెట్టినా తనకు న్యాయం జరగట్లేదని దస్తగిరి అన్నారు.