ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొన్ని రిజర్వేషన్స్ వున్నాయి. నిజానికి, తొలుత అమరావతి విషయంలో వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదాలో చాలా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే, అవేవీ అప్పటి చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదు. ప్రస్తుతానికి అమరావతి, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అయినా, భవిష్యత్తులో రాజధాని విషయమై కీలక నిర్ణయాలు వుండబోతున్నాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల కొన్ని ‘లీకులు’ సంకేతాలుగా బయటకొస్తున్నాయి.
ఆ కీలక నిర్ణయాలు ఎలా వుంటాయోగానీ, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి, అమరావతికి ధీటుగా మరో రెండు నగరాల్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో వైఎస్ జగన్ వున్నారని తెలుస్తోంది. హైద్రాబాద్ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ స్థాయి నగరంగా విశాఖపట్నంకు పేరు ప్రఖ్యాతులున్నాయి. విభన్న సంస్కృతీ సంప్రదాయాల కలయిక అక్కడ కన్పిస్తుంది. కానీ, చంద్రబాబు విశాఖను పట్టించుకోలేదు. ఆ విశాఖపట్నంను ప్రత్యేక మాస్టర్ ప్లాన్ ద్వారా మరింత అభివృద్ధి చేయాలని వైఎస్ జగన్ భావిస్తున్నారట.
మరోపక్క, రాయలసీమలోనూ ఓ అద్భుత నగరం వుండాలన్న దిశగా వైఎస్ జగన్ సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తోంది. కర్నూలు, తిరుపతి ఈ విభాగంలో పోటీ పడ్తున్నాయి. కర్నూలుతో పోల్చితే, తిరుపతికి అవకాశాలెక్కువ వున్నాయి. తిరుపతి ఆల్రెడీ ఆధ్మాతిక కోణంలో అంతర్జాతీయ నగరం కిందనే భావించాలేమో. అక్కడ అద్భుతమైన విమానాశ్రయం అందుబాటులో వుంది. రైలు సౌకర్యం కూడా బావుంటుందక్కడ. కానీ, కర్నూలు అనేది ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా పేరొందింది. సో, సీమలో ఇంకో నగరం.. అనగానే ఠక్కున కర్నూలు పేరే ముందుకొస్తుంది.
నిజానికి, చంద్రబాబు తాను ముఖ్యమంత్రి అయ్యాక ఓ విజన్ని విడుదల చేస్తూ, అందులో ప్రతి జిల్లా కేంద్రాన్నీ స్మార్ట్ సిటీగా మార్చేస్తానని చెప్పారు. జిల్లాకో విమానాశ్రయం తెస్తామనీ అన్నారు. అవేవీ వాస్తవ రూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్, మరో రెండు నగరాల్ని అమరావతికి ధీటుగా, ఆ మాటకొస్తే చంద్రబాబు కలలుగన్న అమరావతిని మించేలా చేయగలిగితే, అది అద్భుతమే అవుతుంది. కానీ, అందుకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి సహకరించాలి కదా!