బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో పాల్గొన్న వారి నుంచి వస్తున్న సమాచారంతో కేసు కీలక మలుపు తీసుకుంటోంది. దీంతో ఈ కేసు మరింత సంచలనంగా మారుతోంది. ప్రతి మలుపు కూడా సుశాంత్ ప్రియురాలు రియా దగ్గరకే చేరడం కీలకంగా మారుతోంది. దర్యాప్తులో భాగంగా సుశాంత్ మాజీ అసిస్టెంట్ అంకిత్ ఆచార్య వెల్లడించిన అంశాలు విస్తుగొలుపుతున్నాయి.
‘సుశాంత్తో నేను మూడు సంవత్సరాలు కలిసి పని చేశాను. ఆ సమయంలో సుశాంత్ చాలా చురుగ్గా ఉండేవాడు. అన్నేళ్లలో బాంద్రాలోని ఇంట్లో తన గదిలో లోపల ఎప్పుడూ గడియ పెట్టుకోవడం నాకు తెలీదు. కానీ.. ఆత్మహత్య చేసుకున్నప్పుడు సుశాంత్ లోపల గడియ పెట్టుకున్నాడని తెలిసి బాధనిపించింది. 2019లో ఓసారి సొంతూరు వెళ్లాను. తిరిగొచ్చేసరికి సుశాంత్ స్టాఫ్ మారిపోయి కొత్త వారు ఉన్నారు. వీరందరినీ రియా మార్చి ఉండొచ్చని భావించాను. కొత్త సిబ్బంది నన్ను సుశాంత్ దగ్గరకి వెళ్లనీయలేదు’ అన్నాడు.
ఇంకా మాట్లాడుతూ.. ‘అదే ఏడాది నాకు ఇవ్వాల్సిన డబ్బు సుశాంత్ ఇచ్చేశాడు. ఆ సమయంలో అతని ముఖంలో వెలుగు లేదు. మానసికంగా కృంగిపోయి ఉండడం గమనించాను. సుశాంత్ అకౌంట్లో 30 కోట్లు ఉన్నట్టు నాకు తెలుసు. రియా విచ్చలవిడిగా ఆ డబ్బును ఖర్చు చేయడం కూడా నాకు తెలుసు. ఆ ఇంట్లో ఎటువంటి విగ్రహాలు లేకుండానే రియా పూజలు చేసేది. సుశాంత్ ఎటువంటి మందులు కూడా వాడేవాడు కాదు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ విషయాలన్నీ కీలకంగా మారాయి.