సాధారణంగా కొన్ని హోటల్లలో, హాస్టల్లో కూరల్లో బల్లులు, పురుగులు కనిపించిన ఇన్సిడెంట్స్ గురించి మనం చాలానే విన్నాం. తాజాగా ఈసీఐఎల్( ECIL) లాంటి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలోని క్యాంటీన్ లో వండిన కూరలో పాము కనిపించడం తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్లోని కాప్రా ప్రాంతంలో ఉన్న ఈసీఐఎల్ లోని ఈవీఎంలు తయారు చేసే విభాగంలోని క్యాంటీన్ లో వండిన పప్పులో పాము పిల్ల కనిపించింది. అక్కడ పనిచేసే కార్మికులు మధ్యాహ్నం భోజనానికి వెళ్లగా..ఒక కార్మికుడి ప్లేట్లో ఇది ప్రత్యక్షమైంది. దీంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు.
అయితే అప్పటికే భోజనం చేసిన నలుగురు ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరిని అక్కడే ఉన్న ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. గతంలోనూ కొన్నిసార్లు కూరల్లో బొద్దింకలు, ఎలుకలు, సిగరెట్ ముక్కలు కనిపించాయని పలుమార్లు కంప్లైంట్ ఇచ్చిన ఫలితం లేదని కార్మికులు చెబుతున్నారు. సంస్థ అధికారులను ఉద్యోగ సంఘాలు ఇలాంటి ఘటనలపై ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పడం లేదని వాపోయారు. ఈ ఘటనపై అధికారులు తక్షణమే స్పందించి నాణ్యమైన భోజనాన్ని అందించాలంటూ క్యాంటీన్ ఎదుట కార్మికులందరూ నిరసనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని కార్మికులకు సర్ది చెప్పారు. పప్పులో కనిపించిన పాము పిల్ల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.