పంచ్ ప్రభాకర్.. భారత న్యాయ వ్యవస్థపై అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన ఎన్నారై. విదేశాల్లో వుంటే, తమను భారతదేశంలోని చట్టాలు ఏమీ చేయలేవని విర్రవీగే పంచ్ ప్రభాకర్తో అధికార పార్టీ నాయకులు ఫొటోలు దిగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?
ఇప్పుడీ అంశం చుట్టూ చాలా రచ్చ జరుగుతోంది. అసలు దేశంలో చట్టాలు ఏం చేస్తున్నాయి.? న్యాయ వ్యవస్థ పని తీరు ఏంటి.? అధికారంలో వున్నోళ్ళు, న్యాయ వ్యవస్థను సవాల్ చేస్తోంటే.. ఆయా వ్యవస్థల మనుగడ ఎలా సాధ్యం.? అన్న ప్రశ్నలు తెరపైకి రావడం సహజమే.
చట్టాలు చేసేది చట్ట సభలు. ఆ చట్ట సభల్లో పెత్తనం అధికారంలో వున్నవారిదే. ఆ చట్టాలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థది. చట్టాలు చేసేది తామేనంటూ అడ్డగోలుగా చట్టాలు చేస్తామంటే న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోదు. మరి, ఆ చట్ట సభలకు ప్రాతినిథ్యం వహిస్తున్నవారే.. ఆ న్యాయ వ్యవస్థపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినవారితో ఫొటోలకు పోజులిస్తే.?
దావోస్లో అధికార పార్టీకి చెందిన ఎంపీ మిధున్ రెడ్డితో పంచ్ ప్రభాకర్ ఫొటోలకు పోజులిచ్చాడట. ఆ పంచ్ ప్రభాకర్ మీద లుకౌట్ నోటీసులు వున్నాయి. సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేస్తోంది. ఆయన్ని ఎలా అరెస్టు చేస్తారంటూ పదే పదే న్యాయస్థానం సీబీఐకి అల్టిమేటం జారీ చేస్తూనే వుంది. రాష్ట్ర పోలీసులు ఈ వ్యవహారంలో ముందే చేతులెత్తేసిన సంగతి తెలిసిందే.
పరిస్థితి ఇంత సున్నితమైనదిగా వున్నప్పుడు, అధికార పార్టీ నాయకులతో చెట్టాపట్టాలేసకు తిరుగుతున్నానన్నట్లు చెబుతున్నాడు పంచ్ ప్రభాకర్. ఓ పార్టీకి ఆయన మద్దతుదారుడు కావొచ్చు. కానీ, భారతదేశాన్ని ఆయన సవాల్ చేస్తున్నాడు తన చర్యలతో. ఆయన్ని భారతదేశం ఏమీ చేయలేకపోతోందంటే, దానర్థమేంటి.?