జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్ కళ్యాణ్ ఇచ్చిన భరోసాతో ఇకపై తిరుపతి అభ్యర్థి శ్రీనివాసులుతో ప్రచారంలో పాల్గొంటారట.
తిరుపతి శ్రీకాళహస్తి సహా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాకి చెందిన పలువురు జనసేన నేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలిశారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుంటామని పవన్ కళ్యాణ్కి వాళ్ళంతా మాటిచ్చారు.
అసలు ఎందుకీ పరిస్థితి వచ్చింది.? అన్ని లెక్కలూ వేసుకుని, అన్ని పరిస్థితుల్నీ ఆకలింపు చేసుకుని, అభ్యర్థుల్ని ఎంపిక చేశాక, ఈ గలాటా ఎందుకు తెరపైకొచ్చినట్లు.? అధినేత రంగంలోకి దిగితే తప్ప, పరిస్థితులు చక్కబడనంతగా బజారుకెక్కాయెందుకు.?
సరే, ఎన్నికల వేళ ఇలాంటివన్నీ మామూలే. కాకపోతే, అధినేత పవన్ కళ్యాణ్, తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టాల్సి వుంది. దానికి తోడు, తీవ్ర జ్వరంతో ఇటీవల పవన్ కళ్యాణ్ బాధపడ్డారు, ఇంకా పూర్తిగా కోలుకోలేదాయన.
‘పవన్ కళ్యాణ్ గారు మొత్తం డేటాతో వచ్చారు. ఆయనకి అన్ని విషయాలూ తెలుసు. మేం కొత్తగా చెప్పడానికేమీ లేదు. మాకు భరోసా ఇచ్చారు..’ అని కిరణ్ రాయల్ చెప్పారంటే, ఇప్పటిదాకా అధినేత నిర్ణయాన్ని కిరణ్ రాయల్ ఎందుకు గౌరవించలేకపోయినట్టు.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది.
పవన్ కళ్యాణ్ వరకూ కాదు, ముందుగానే ఈ సమస్య పరిష్కారమై వుండాల్సింది. నాగబాబు లాంటి నాయకులు, ఆయా సమస్యల్ని పరిష్కరించగలిగితే, అధినేత పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తగ్గుతుంది కదా.?