డబ్బు ప్రమేయం లేని, నిజాయతీ కలిగిన రాజకీయాలు తీసుకొస్తానన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. జనసైనికుల పేరుతో కొంతమంది చేస్తున్న పనుల వల్ల అటు అధినేతకు, ఇటు పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తోంది. పూర్తిస్థాయి రాజకీయ నేతగా పవన్ ఉండటం లేదనే విమర్శలు పక్కనపెడితే, రాజకీయాల్లో ఆయన సరికొత్త ఒరవడి తీసుకొచ్చారన్నది మాత్రం నిజం.
మొన్నటి ఎన్నికల్లో డబ్బు ప్రమేయం లేకుండా రాజకీయాలు చేయాలని ఆకాంక్షించిన ఆయన.. చెప్పినట్టే నడుచుకున్నారు. అయితే, కొన్నిచోట్ల పార్టీ అభ్యర్థులు మాత్రం అధినేతకు తెలియకుండా సొంతంగా డబ్బులు ఖర్చు చేశారు. అందువల్ల ఈ విషయంలో పవన్ ను ఎవరూ వేలెత్తి చూపలేరు. కానీ ప్రస్తుతం జనసైనికుల పేరుతో కొంతమంది సాగిస్తున్న దందా మాత్రం పార్టీకి ఇబ్బందిగా పరిణమించింది. పవన్ పేరు చెప్పి డబ్బులిస్తారా లేక తమ ప్రతాపం చూపించాలా అంటూ దందాలు చేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఇలాంటి విషయాల్ని పవన్ సరిగా పట్టించుకోకపోవడంతో అలాంటి వారు మరీ రెచ్చిపోతున్నారని అంటున్నారు.
ఇటీవల నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ కేసులో ఓ విద్యాసంస్థ పేరు బయటకు వచ్చింది. ఇదే అదనుగా జనసేనకు చెందిన నాయకుడు ఒకరు ఆ విద్యాసంస్థ యజమానికి దగ్గరకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. రూ.25 లక్షలు ఇస్తారా లేక మీ సంస్థ ముందు పవన్ కల్యాణ్ తో ధర్నా చేయించాలా అంటూ బెదిరించినట్టు వార్తలొచ్చాయి. ఈ అంశం నెల్లూరు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
వాస్తవానికి జనసేన పేరు చెప్పి దందాలు చేయడం ఇటీవల కాలంలో పెరిగిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండకపోతే ఆయనకే చెడ్డ పేరు వస్తుందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పార్టీ విరాళాల రూపంలో సేకరించిన లక్షలాది రూపాయల మొత్తం పలువురు స్వాహా చేశారని జనసేన వర్గాలే చెబుతున్నాయి.
దీంతో విరాళాలను సైతం ఆన్ లైన్ లోనే స్వీకరించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇలాంటి సమయంలో వెలుగులోకి వస్తున్న దందాల పట్ల కూడా పవన్ అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. మరి జనసేనాని వీటిపై స్పందిస్తారో లేదో?