రూపాయి జరీమానా వేయడమేంటి.? న్యాయస్థానాల మీదా, న్యాయమూర్తుల మీదా అడ్డగోలు వ్యాఖ్యలు చేసినవారికి ‘రూపాయి మాత్రమే’ జరీమానా విధిస్తే సరిపోతుందా.? దేశవ్యాప్తంగా ఇప్పుడీ అంశంపై హాట్ హాట్గా చర్చ జరుగుతోంది.
న్యాయవాది ప్రశాంత్ భూషన్, న్యాయమూర్తి బాబ్డే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ సోషల్ మీడియాలో ట్వీట్లేయడం దుమారం రేపిన విషయం విదితమే. ఈ కేసులో క్షమాపణ చెప్పాల్సిందిగా ధర్మాసనం ఆదేశిస్తే, ససేమిరా అన్నారు ప్రశాంత్ భూషన్. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేసి, విచారణ చేపట్టిన ధర్మాసనం.. న్యాయవాది ప్రశాంత్ భూషన్కి ‘ఒక్క రూపాయి’ జరీమానా విధించింది.
గడువు లోపు ఆ ఒక్క రూపాయి జరీమానా చెల్లించకపోతే మాత్రం మూడు నెలల జైలు శిక్ష, మూడేళ్ళపాటు న్యాయవాద వృత్తి కొనసాగించకుండా నిషేధం విధించబడుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇక్కడ, విషయం సుస్పష్టం. జరీమానా చెల్లించడమంటే, ప్రశాంత్ భూషణ్ నేరాన్ని అంగీకరించడమే. కానీ, ఆయన అలా అంగీకరించాల్సి వస్తుందనే.. న్యాయస్థానానికి క్షమాపణ చెప్పబోనని తేల్చి చెప్పారు. అయితే, ఇప్పుడు జరీమానా చెల్లించకపోవడం ఇంకా పెద్ద తప్పిదమే అవుతుంది. తద్వారా ఆయన మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి వుంటుంది. అలాగే, న్యాయవాద వృత్తికి మూడేళ్ళపాటు దూరమవ్వాల్సి వస్తుంది.
గోటితో పోయేదాన్ని ఇప్పటికే గొడ్డలిదాకా తెచ్చుకున్న ప్రశాంత్ భూషణ్.. దాన్ని మరింత కఠినంగా మార్చుకుంటారా.? అన్నది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఇదిలా వుంటే, న్యాయస్థానాలపైనా, న్యాయమూర్తులపైనా కొందరు అవాకులు చెవాకులు పేలుతున్న విషయం విదితమే. అలాంటివారికి ‘రూపాయి జరీమానా’ అనేది ఓ వెటకారంలా కన్పించడం వింతేమీ కాదు.