సోషల్ మీడియాలో ఏదో ఒక చెత్త కామెంట్ పెట్టడం.. జనాలతో తిట్టించుకోవడం తప్ప వేరే పనిలేనట్టుంది వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డికి. ఒకరిద్దరు విజయసాయి ట్వీట్లపై హర్షం వ్యక్తం చేస్తే.. వందల మంది ఆయన్ని ఏకి పారేస్తుంటారు. ‘పబ్లిసిటీ కక్కుర్తి’ కాకపోతే, తిట్టించుకోవడం కోసం ట్వీట్లు పెట్టడమేంటట.?
‘కరోనా ఆపత్కాలంలో రాజకీయాలు చేయకుండా జనసేన స్వీయ నియంత్రణ పాటిస్తోందట. రాజకీయాలు చేయడానికి నీకు గ్రౌండే లేదు కదా పవన్. ఎక్కడో హైద్రాబాద్లో కూర్చుని, నేను లేస్తే మనిషిని కాదు అని చిటికెలేసినట్లుగా వుంది నీ వాలకం. ప్రజా తీర్పుని అప్పుడే మర్చిపోతే ఎలా.?’ అని విజయసాయిరెడ్డి తాజాగా ట్వీటేశారు.
కరోనా వైరస్ వేళ జనసేన పార్టీ పాటిస్తున్న సంయమనం అందరికీ తెల్సిందే. కానీ, అధికార వైసీపీ ఏం చేస్తోంది.? అడ్డగోలు రాజకీయాలు చేస్తోంది. ఈ సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని మార్చాల్సిన అవసరం ఏంటి.? ఓ పక్క జనం కరోనా వైరస్తో ప్రాణాలు కోల్పోతోంటే.. స్థానిక ఎన్నికలు ఎలాగైనా జరిపేయాలనే కక్కుర్తి అధికార పార్టీది. తమ రాజకీయ కక్కుర్తికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహరించకపోవడంతో, అడ్డగోలు ఆర్డినెన్స్ తెచ్చి.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని తగ్గించి, కమిషనర్గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్కుమార్పై ‘కుల’ ముద్ర వేసి, సాగనంపేశారు. న్యాయస్థానాల్లో మొట్టికాయలు అలవాటైపోయిన వైసీపీ ప్రభుత్వానికీ ఈసారి కూడా మొట్టికాయలు తప్పేలా లేవు. నిమ్మగడ్డ రమేష్కుమార్ వ్యవహారంపై ప్రభుత్వాన్ని జనసేన ప్రశ్నించడంతో, వి.సా.రెడ్డిగారికి కోపమొచ్చి పై విధంగా ట్వీటేశారు.
దానికి స్పందించిన జనసేన నేత నాగబాబు, వైసీపీ గుంటనక్క రాజకీయాల్ని బయటపెట్టారు. ‘విజయసాయిరెడ్డీ.. నువ్వు చెప్పింది కరెక్టే. ఈ ఎదవ రాజకీయాలు చేయడానికి నీలాంటి గుంటనక్కలున్న సంగతి మాకు తెలుసు. విజయసాయిరెడ్డి.. మన ఇద్దరి కామన్ స్నేహితుడి ద్వారా నా ఇంటికి వచ్చి పవన్తో దోస్తీకి రెడీ అన్న మీ గుంట నక్క రాజకీయాలు నాకు గుర్తున్నాయి..’ అంటూ నాగబాబు ట్వీటేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది.
నిజమే, 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీతో పొత్తు కోసం వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసింది. సాక్షాత్తూ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. అయితే, జనసేన అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ, అటు టీడీపీ నేతలు, ఇటు వైసీపీ నేతలు.. గ్రౌండ్ లెవల్లో పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ఓట్లు అడుక్కున్న విషయాన్ని ఎలా మర్చిపోగలం.? గుంటూరు జిల్లాలో ఓ ముఖ్య నేత అయితే, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఉద్దేశించి తనకే ఓటు వేయాలనీ, లేకపోతే తన రాజకీయ భవిష్యత్తు ముగిసిపోతుందనీ కంటతడి పెట్టిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.?
@vsredyy_Mp .నువ్వు చెప్పింది.correte . ఈ ఎదవ రాజకీయాలు చేయటానికి నీ లాంటి గుంటనక్కలున్న సంగతి మాకుతెలుసు విజయ సాయి రెడ్డి..మరి మన ఇద్దరి కామన్ స్నేహితుడి ద్వారా నా ఇంటికి వచ్చి పవన్ తో దోస్తీ కి రెడి అన్నమీ గుంట నక్కరాజకీయలు నాకు గుర్తున్నాయి. pic.twitter.com/r407jkNysM
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 11, 2020