చట్ట సభలకి ఎవర్ని పంపుతున్నాం.? అన్న కనీసపాటి ఇంగితం ఓటర్లకు లేకపోతే.. ఇదిగో, కొడాలి నాని లాంటి వ్యక్తులు చట్ట సభలకు వెళతారు.! మంత్రులు కూడా అవుతారు.!
‘ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టకూడదని అంబేద్కర్ ఏమైనా రాజ్యాంగంలో రాశారా.?’ అంటూ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని మీడియా ముందు తెగ రుసరుసలాడిపోయారు.
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిని ‘కమ్మరావతి’ అంటోంది వైసీపీ.! అసలక్కడ రాజధాని అవసరమే లేదన్నది వైసీపీ వాదన. కానీ, అక్కడే అసెంబ్లీ వుంది, అక్కడే సెక్రెటేరియట్ వుంది, అక్కడే హైకోర్టు కూడా వుంది.
ఐదేళ్ళుగా అమరావతిని స్మశానం అంటున్నారు, ముంపు ప్రాంతం అంటున్నారు, ఎడారి అంటున్నారు వైసీపీ నేతలు.. అందునా ప్రజా ప్రతినిథులు. చిత్రమేంటంటే, ఇంతవరకు ఎప్పుడూ అమరావతి మునిగిపోయింది లేదు.! ఎడారిని తలపించే ఇసుకా లేదు. స్మశానం అన్న ప్రస్తావన అత్యంత హేయం.
సరే, వైసీపీ ఉద్దేశ్యంలో మూడు రాజధానులే నిజమని అనుకుందాం. అందులో కూడా అమరావతి ఒకటి కదా.! ఆ అమరావతి మీద విషం చిమ్మీ చిమ్మీ అలుపూ అయాసం అస్సలు రావడంలేదు వైసీపీ నేతలకి.
అమరావతి అవసరంలేదు.. అమరావతిలోని తాత్కాలిక సచివాలయం కూడా అవసరం లేదా.? అవసరం వుంది, తాకట్టు పెట్టుకోవడానికి.! తాకట్టు పెట్టేశారంటూ ఓ వార్త ఓ మీడియా సంస్థ ద్వారా వెలుగులోకి వచ్చింది. అది ‘ఫేక్’ అంటోంది వైసీపీ సర్కారు. ఈ మేరకు ఫ్యాక్ట్ ఛెక్ పేరుతో ఖండన కూడా బయటకు వచ్చింది.
ఇంతలోనే మాజీ మంత్రి కొడాలి నాని మీడియా ముందుకొచ్చారు. చంద్రబాబు మీద నానా దుర్భాషలూ ఆడేశారు కొడాలి నాని షరామామూలుగానే. ‘ప్రభుత్వ ఆస్తుల్ని అవసరాల నిమిత్తం తాకట్టు పెడితే తప్పేంటి.? తాకట్టు పెడతాం, విడిపించుకుంటాం..’ అంటూ కొడాలి నాని వింత వాదనను తెరపైకి తెచ్చారు.
ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మడం లేదా తాకట్టు పెట్టడం అనేది నిజానికి కొత్త విషయం కాదు. అయితే, దానికీ ఓ పద్ధతి అంటూ వుండి ఏడుస్తుంది. కానీ, వైసీపీ హయాంలో.. ఆ పద్ధతులు కాలగర్భంలో కలిసిపోయాయి.
సచివాలయాన్ని తాకట్టు పెట్టలేదని ఫ్యాక్ట్ చెక్ చెబుతోంటే, తాకట్టు పెట్టామని ఓ మాజీ మంత్రి చెబుతున్నాడు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి చెందిన సెక్రెటేరియట్ని అయినా తాకట్టు పెట్టిన సందర్భం వుందా.? నవ్విపోదురుగాక.. అన్నట్లుంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ తీరు.