temparature: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతలు, వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 7గంటల నుంచే ఎండ కాస్తోంది. వాయువ్య భారత్ (India) నుంచి వీస్తున్న వేడి గాలులతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా తయారైంది. గడచిన రెండు రోజులుగా ఇదే పరిస్థితి. దీంతో రాష్ట్రంలో విద్యుత్ (Electricity) డిమాండ్ కూడా పెరిగిపోతోంది. గడచిన 24 గంటల్లో ఏపీలో 11,939 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగిందని ఏపీ ట్రాన్స్ కో (AP Transco) అధికారులు అంటున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
నేడు నమోదైన ఉష్ణోగ్రతలలో ప్రకాశం జిల్లా పెద్దారవీడులో 46 డిగ్రీలు నమోదు కాగా.. మద్దిపాడు, నెల్లూరు నగరంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాల్లో.. నరసారావు పేట, వెంకటగిరి, తిరుపతిలో 44 డిగ్రీలు, కర్నూలు, యర్రగొండపాలెం, బాపట్ల, మార్కాపురం, గుంటూరులో 43డిగ్రీలకు పైగా, అనంతపురం, సుళ్లూరుపేట, డొర్నాల, కంభం, గురజాల, ఏలూరు, ద్వారకా తిరుమలలో 42 డిగ్రీలు, చిత్తూరు, శ్రీకాకుళంలో 41 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.