ఆంధ్ర ప్రదేశ్లో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఉమ్మడిగా ఏర్పాటు చేసిన ప్రజా గళం బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని, ఎన్నికల ప్రచారాన్ని తనదైన స్టయిల్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో, కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కారే.. అంటూ నినదించారు ప్రధాని నరేంద్ర మోడీ.
టీడీపీ ఈ కూటమిలో ప్రధాన పార్టీ అయినా, ఎన్డీయే కూటమిలానే ఈ కూటమిని పిలవాల్సి వస్తోంది. ఎందుకంటే, ఎన్డీయే కూటమిలో టీడీపీ, జనసేన చేరాయి. ఈ మేరకు టీడీపీ, బీజేపీ, జనసేన నుంచి ఉమ్మడి ప్రకటన ఇటీవలే వచ్చింది.
ఇంతకీ, ఎన్డీయే కూటమి ఏపీలో ఎన్ని అసెంబ్లీ సీట్లు.. ఎన్ని లోక్ సభ సీట్లు దక్కించుకోగలుగుతంది.? ఈ విషయమై భిన్న వాదనలున్నాయి. ఇప్పటికీ పలు సర్వేలు వైసీపీకే పట్టం కడుతున్నాయి. ఎన్డీయే కూటమికి రాష్ట్రంలో 60 వరకు మాత్రమే అసెంబ్లీ సీట్లు దక్కుతాయని చెబుతున్నాయి.
కొన్ని సర్వేలు మాత్రం, ప్రభుత్వం మారుతుందనీ, టీడీపీ సొంతంగా అధికారాన్ని చేపడుతుందనీ, జనసేన కూడా చెప్పుకోదగ్గ సీట్లు సాధిస్తుందని చెబుతున్నాయి. కొన్ని సర్వేలు జనసేనకు 5 నుంచి 10 సీట్లు వస్తాయని చెబుతోంటే, ఇంకొన్ని సర్వేలు జనసేన 100 శాతం స్ట్రైక్ రేట్తో 21 అసెంబ్లీ సీట్లూ కైవసం చేసుకుంటుందని చెబుతుండడం గమనార్హం.
ఇవన్నీ ముందస్తు సర్వేలు మాత్రమే. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటే, ముందు ముందు మరింత స్పష్టత వస్తుంది ఎవరెన్ని సీట్లు గెలుస్తారన్నదానిపై. ప్రచారంలో వైసీపీ దూసుకెళుతోంటే, టీడీపీ – జనసేన – బీజేపీ.. ఇప్పుడిప్పుడే జనానికి మరింత చేరవవుతోంది.
గ్రౌండ్ లెవల్లో పరిస్థితుల్ని చూస్తే, ‘ఒక్కసారి అవకాశమిచ్చి నష్టపోయాం’ అన్న భావనే ప్రజల్లో వుంది. కూటమి వైపే జనం మొగ్గు చూపుతున్నారు. అంతిమంగా రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోలు, పోలింగ్కి ముందు జరిగే పంపకాలు.. వీటి కారణంగా ఫలితాల్లో స్వల్ప మార్పు వుండొచ్చు.
అంతా బాగానే వుందిగానీ, డబుల్ ఇంజిన్ సర్కార్ మాటేమిటి.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. సొంతంగా అధికారంలోకి వచ్చి, బీజేపీకి పెద్దగా సీట్లు రాకపోతే.. ఇంకోసారి బీజేపీని చంద్రబాబు డంప్ చేసేయొచ్చన్నది వైసీపీ అంచనా.! ఇదే భయం బీజేపీలోనూ వుంది.