‘ప్రపంచంలో చాలా దేశాలతో పోల్చితే మన దేశంలో కరోనా మరణాల సంఖ్య తక్కువే..’ అని కేంద్రం చెబుతోంది. నిజమేనా.? గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు ఎలా వున్నాయి.? లాక్డౌన్ సత్ఫలితాలనిచ్చిందా.? పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చేసిందా.? ఇలా రకరకాల ప్రశ్నలు.. వేటికీ సరైన సమాధానం దొరకడంలేదు. లాక్డౌన్తో సాధించింది ఏంటి.? అని వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆర్థికంగా దేశం ఇబ్బందుల్లో కూరుకుపోవడమొక్కటే కన్పిస్తోందన్నది చాలామంది అభిప్రాయం. కానీ, అదే లాక్డౌన్ లేకపోయి వుంటే, ఈపాటికే దేశంలో 20 నుంచి 30 లక్షల పాజిటివ్ కేసులు నమోదయి వుండేవన్నది కేంద్రం వాదన. కానీ, ఇప్పుడు ఏం జరుగుతోంది.? నిన్న 9 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. నేడు ఒక్క రోజే 10 వేల కేసులు నమోదయినా ఆశ్చర్యపోనక్కర్లేదనే స్థాయిలో వాదనలు విన్పిస్తున్నాయి.
ముందు ముందు రోజువారీ కేసులు ఏ స్థాయిలో పెరుగుతాయో ఊహించడమే భయానకంగా అన్పిస్తోంది. మరి, లాక్డౌన్తో ఏం సాధించినట్లు.? ఇక, రికవరీలు పెరుగుతుండడం ఊరటనిచ్చే విషయమే. కానీ, అదే సమయంలో మరణాల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్నే తీసుకుంటే, తెలంగాణలో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. కేసుల సంఖ్య కూడా గత కొద్ది రోజుల నుంచి ఆందోళనకర రీతిలో పెరుగుతుండడం గమనార్హం. మహారాష్ట్రంలో కరోనా స్వైరవిహారమే చేస్తోంది. తమిళనాడు, ఢిల్లీ ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. దాదాపుగా దేశంలో అన్ని రాష్ట్రాలూ రోజువారీ కేసుల నమోదులో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తుండడం గమనార్హం. వలస కూలీలు స్వస్థలాలకు వెళుతుండడంతో కేసులు పెరుగుతున్నట్లు కేంద్రం చెబుతోంది. ఎక్కువగా క్వారంటైన్ కేంద్రాల్లో వున్నవారి నుంచే కేసులు వెలుగు చూస్తుండడం కొంత ఊరటనిచ్చే విషయమే.
అయినాగానీ, కరోనా వైరస్కి సంబంధించి పరీక్షలు జరగాల్సిన స్థాయిలో జరగడంలేదన్న విమర్శలున్నాయి. సామాజిక వ్యాప్తి ఎప్పుడో ప్రారంభమైపోయింది. ఈ నేపథ్యంలో ట్రేసింగ్ అనేది అవసరమే అయినా, ఆ స్థాయిలో అది కూడాజ జరగడంలేదన్న వాదనలూ లేకపోలేదు. మొత్తంగా చూస్తే, జూన్ నెలాఖరునాటికి కరోనా దేశంలో పీక్ స్టేజ్కి వెళ్ళొచ్చన్న అంచనాలే నిజమయ్యేలా వున్నాయి. మరోపక్క, జూన్ నెలాఖరుకు కాదు.. ప్రమాదపు అంచులు.. జులై చివరి నాటికి చూడబోతున్నాం.. అంటూ మరింత భయాందోళనకరమైన విషయాన్ని చెబుతున్నారు. వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే అవకాశాల్లేకపోవడం.. దేశంలో వర్షాకాలం ప్రారంభమవుతుండడంతో.. రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిందే. నిన్న 9 వేల కేసులు.. సుమారు రెండొందల యాభై మరణాలు దేశవ్యాప్తంగా సంభవించిన దరిమిలా.. ముందు ముందు మరణాల సంఖ్య అత్యంత వేగంగా పెరిగే అవకాశముందనే అంచనాకి వస్తున్నారు నిపుణులు.