Bala Krishna: ‘సందేశం ఇవ్వాలంటే సినిమాను మించిన మాధ్యమం లేదు. కొందరు చెప్తేనే ఆ విషయం ప్రజల్లోకి వెళ్తుంద’ని బాలకృష్ణ అన్నారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో శ్రీలీల (Sreeleela) ముఖ్యపాత్రలో ఆయన నటించిన భగవంత్ కేసరి (Bhagavanth Kesari) విజయోత్సవ వేడుకలో ఆయన మాట్లాడారు. రాఘవేంద్రరావు, అం బికా కృష్ణ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. బాలకృష్ణ మాట్లాడుతూ..
‘సినిమాకు ప్రేక్షకాదరణకు మించింది మరొకటి లేదు. వైవిధ్యభరితమైన పాత్రలు, ప్రయోగాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నాన్నగారి నుంచి నాకు వచ్చిన వారసత్వం. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఆ కోవలోనివే. సినిమాకు పని చేసిన వారందరినీ సత్కరించేందుకే ఈ కార్యక్రమం ఉద్దేశం’.
‘సినిమాలో పాత్రలన్నీ గొప్పవే. పంపిణీదారులు సంతోషంగా ఉన్నారు. వారు బాగుంటే పరిశ్రమ కూడా బాగుంటుంది. భగవంత్ కేసరి హిందీలోకి వెళ్తోంది. నేనే హిందీలో స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నా. నాన్నగారితో అనేక సినిమాలు చేసిన రాఘవేంద్రరావు రావడం సంతోషంగా ఉంది. దాసరి నారాయణరావు గారు ఉంటే బాగుండేది. ఆయన లేని లోటు తెలుస్తోంది. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండేవార’ని అన్నారు.