వెనెజులా.. లాటిన్ అమెరికాలో అత్యంత ధనిక దేశంగా ఒకప్పుడు విరాజిల్లింది. కానీ ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఎంతలా అంటే.. చిన్న రొట్టె ముక్క కోసం కొట్లాడుకునేలా, కుళ్లిన మాంసాన్ని తిని కడుపు నింపుకొనేలా, చదవుకునే బాలికలు సైతం వ్యభిచార కూపంలోకి దిగిపోయేలా అక్కడ దుర్భర పరిస్థితులు తాండవిస్తున్నాయి. ఇదంతా కేవలం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు తాయిలాలను పప్పుబెల్లాల్లా పంచిబెట్టినందుకే. త్వరలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా ఇలాగే మారిపోయే ప్రమాదం ఉందట. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకులో ఈ మేరకు తన ఆందోళన వ్యక్తంచేశారు.
అభివృద్దిని విస్మరించి అంతులేని సంక్షేమం చేయడం ఎంతమాత్రం మంచిది కాదని సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆయన హితవు చెప్పారు. అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం సంక్షేమంపై ఆధారపడినంత మాత్రాన ఆశించిన రాజకీయ ప్రయోజనం నెరవేరదని.. అభివృద్ది, సంక్షేమం సమపాళ్లలో ఉన్నప్పుడే ప్రజలు సంతృప్తి చెందుతారని స్పష్టంచేశారు. ఆదాయాన్ని పెంచుకుంటూ సంక్షేమానికి కొంత వెచ్చిస్తే పర్వాలేదు కానీ, ఆదాయం పెంచే రాజధాని గురించి ఆలోచించకుండా ఉన్నదంతా సంక్షేమానికే ఖర్చు చేస్తే దాని దుష్పరిణామాలను భవిష్యత్తు తరాలు అనుభవించవలసి ఉంటుందని హెచ్చరించారు.
వాస్తవానికి రాధాకృష్ణ చెప్పిన విషయాలు నూటికి నూరుపాళ్లూ నిఖార్సైనవే. అవన్నీ ఆందోళన చెందాల్సిన అంశాలే. అయితే, ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎందుకు చెప్పలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రైతు రుణమాఫీ దగ్గర నుంచి చంద్రన్న కానుకలు, ఎన్నికల ముందు పసుపు-కుంకుమ పేరుతో మహిళలకు డబ్బులు పంచినపెట్టినప్పుడు ఏపీ మరో వెనెజులా అయిపోతుందనే సంగతి ఆయనకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.
అసలే రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందని తెలిసి కూడా పార్టీ కార్యక్రమాలకు సైతం ప్రభుత్వ ధనాన్ని వెచ్చించినప్పుడు ఇలా ఎందుకు బాబుకు హితవు చెప్పలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీడియా ప్రతిపక్ష పాత్ర పోషించడం ఆహ్వానించతగ్గ పరిణామమే అని, అయితే ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే పని చేయాల్సి ఉంటుందని అంటున్నారు. అలా కాకుండా మన అనుకూల ప్రభుత్వం ఉంటే ఒకలా, వ్యతిరేక ప్రభుత్వం ఉంటే మరోలా వ్యవహరించడం సబబు కాదని చెబుతున్నారు.
791740 970518Spot on with this write-up, I truly suppose this internet web site needs rather more consideration. most likely be once a lot more to learn considerably a lot more, thanks for that info. 237975