సలహాదారుల పేరుతో పొరుగు రాష్ట్రాలకి చెందిన కొందరికి వైసీపీ సర్కారు అప్పనంగా ప్రజాధనాన్ని దోచిపెట్టిన మాట వాస్తవం. అది వేరే చర్చ. వాలంటీర్ వ్యవహారం అలా కాదు. వాలంటీర్లంటే, ఏపీ ఓటర్లే.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కాకపోతే, వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలు. అక్కడే వచ్చింది అసలు సమస్య.
ఏకంగా రెండున్నర లక్షల మంది వైసీపీ కార్యకర్తలకి వాలంటీర్లుగా అవకాశమిచ్చారు. కాదు కాదు, వాలంటీర్ పేరుతో, అంతమందినీ వైసీపీ కార్యకర్తలుగా మార్చేసుకుంది అధికార పార్టీ.! ఈ వాలంటీర్లు గడచిన కొన్నేళ్ళుగా ఎన్నెన్ని అకృత్యాలకు పాల్పడుతున్నారో మీడియాలో చూస్తూనే వున్నాం. అందరూ అని కాదుగానీ, చాలామంది వాలంటీర్ల వ్యవహారం అదే.
అందుకే, వాలంటీర్ వ్యవస్థ మీద అంతలా విమర్శలు వచ్చింది. చివరికి ఎన్నికల విధుల్లో వాలంటీర్లకు అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల సమయంలో సామాజిక పెన్షన్ల పంపిణీకి కూడా పనికిరాకుండా పోయారు. పనికిరాకుండా పోవడమంటే, అసలు వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి సంబంధించినది కాదు, పార్టీకి సంబంధించినదనే కదా అర్థం.?
మరి, వాలంటీర్ల మీద అన్ని విమర్శలు చేసి, ఇప్పుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మాట మార్చితే ఎలా.? ఐదు వేలు కాదు, పది వేలు ఇస్తాం తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు.. అంటూ ఇటీవల చంద్రబాబు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
ఈ ప్రకటనపై మెజార్టీ వాలంటీర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందే చెప్పుకున్నట్టు వాలంటీర్లలో అందరూ వైసీపీ కార్యకర్తలు కాదు, దుర్మార్గులు కాదు. కొందరు ఏ అవకాశం లేక, వాలంటీర్ పనిలో చేరినవారూ వున్నారు.
టీడీపీ మీదకి వైసీపీ ఉసిగొల్పిన వాలంటీర్లు, ఇప్పుడు బీజేపీ – జనసేన – టీడీపీ పట్ల కొంత సానుకూలంగా మారిన మాట వాస్తవం. అది వైసీపీకి షాకింగ్ అంశమే.
ప్రస్తుతం వున్న ఈక్వేషన్ బట్టి చూస్తే, వాలంటీర్ వ్యవహారం వైసీపీకి బెడిసి కొట్టినట్లే కనిపిస్తోంది.