ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు ఏంటీ..? అంటే ఠక్కున జవాబు చెప్పలేని పరిస్థితి. గతంలో టీడీపీ ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతి అని ప్రకటిస్తే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తెచ్చింది. దీంతో ఏపీ రాజధానిపై కేంద్రం వద్ద కూడా స్పష్టత లేదు. ఈక్రమంలో నాలుగో తరగతి ‘మన ప్రపంచం’ పాఠ్యపుస్తకంలో ఆంధ్రప్రదేశ్ కు రాజధాని పేరు లేకుండానే ముద్రించడం చర్చనీయాంశమైంది.
పాఠ్యపుస్తకం చివరలో భారతదేశ పటం.. అందులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి రాజధానుల పేరును ముద్రించి.. ఆంధ్రప్రదేశ్ కు మాత్రం రాష్ట్రం పేరును మాత్రమే రాశారు. దీంతో.. పిల్లలకు ఏపీ రాజధాని ఏమని చెప్పాలి..? అని ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి 2020-21 కి కొత్తగా ద్విభాషా పుస్తకాలను ముద్రించింది. పుస్తకాల బరువు తక్కువగా ఉండేందుకు మూడు సెమిస్టర్లుగా విభజించారు. రెండో సెమిస్టర్ టెక్స్ట్ బుక్ లో భారతదేశ పటాన్ని ముద్రించారు. అందులోనే రాజధాని లేని ఏపీ కనిపిస్తోంది.