ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర వేశాక, టీడీపీ మద్దతుదారులిలా, కూటమిలోని మిత్రపక్షాలపై విరుచుకుపడటాన్ని ఎలా చూడాలి.?
బూతులు.. అత్యంత దారుణమైన బూతులతో బీజేపీ, జనసేన అభ్యర్థుల్ని టీడీపీ మద్దతుదారులు దూషిస్తున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేన అధినేతకు కేటాయిస్తే, ఆ విషయమై స్థానిక టీడీపీ కార్యకర్తలు చేసిన యాగీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
వైసీపీని ఇంటికి పంపించే క్రమంలో టీడీపీ – జనసేన – బీజేపీ ఒక్క తాటిపైకి వచ్చాయన్న విషయాన్ని కొందరు టీడీపీ కార్యకర్తలు మర్చిపోతున్నారు. టీడీపీ నేతల్లోనూ కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ గలాటా చోటు చేసుకుంటోంది.
పోటీ చేసే అభ్యర్థి బలమైనోడా.? కాదా.? అన్న విషయాన్ని పక్కన పెట్టి, ఆయా స్థానాల్లో వైసీపీని ఓడించడం ఎలా.? అన్నదానిపై టీడీపీ, జనసేన, బీజేపీ ఫోకస్ పెట్టాల్సి వుంది. టీడీపీకి కేటాయించిన స్థానాల్లో టీడీపీని గెలిపించడానికి జనసేన, బీజేపీ సిద్ధమైనప్పుడు, జనసేన, బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో ఆయా పార్టీల అభ్యర్థుల్ని గెలిపించడానికి టీడీపీ కూడా సిద్ధపడాలి కదా.?
ప్రధానంగా నారా లోకేష్ కనుసన్నల్లో నడుస్తున్న ఓ వర్గం మీడియా, సోషల్ మీడియా ఇలా జనసేన, బీజేపీ అభ్యర్థులపై విషం చిమ్ముతున్నారన్న ఆరోపణలున్నాయి. సో, ఈ మొత్తం రగడను చల్లార్చాల్సిన బాధ్యత కూడా నారా లోకేష్ మీదనే వుందన్నది నిర్వివాదాంశం.
ఎన్నికల ప్రచారం ఊపందుకోవాలి.. ఈ తరుణంలో పార్టీల మధ్య కార్యకర్తల్లో గలాటా జరిగితే, అది కూటమికి ఇబ్బందికరంగా మారుతుంది.