ఆంధ్రప్రదేశ్ చేస్తున్న అప్పులు గతంతో పోలిస్తే ఎక్కువయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2019తో పోలిస్తే అప్పుడు రెండింతలకు పైగా పెరిగాయని రాజ్యసభలో తెలిపింది. ఈమేరకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ కు 2019లో రూ.2,64,451కోట్లు ఉండగా.. 2020లో రూ.3,07,671కోట్లకు పెరిగాయని అన్నారు. 2021లో రూ.3,53,021కోట్లు ఉండగా 2022 ఏడాదికి సవరించిన అంచనాల తర్వాత రూ.3,93,718కోట్లకు చేరిందని వెల్లడించారు. ప్రస్తుత ఏడాది.. 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ఇప్పటికి రూ.4,42,442కోట్లుగా ఉందని వివరించారు. బడ్జెట్ అప్పులతోపాటు కార్పొరేషన్లు సహా ఏపీ ఇతర మార్గాల్లో చేస్తున్న అప్పులు ఇందుకు అదనమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కుప్పలుతెప్పలుగా అప్పులు చేస్తోందని ఆరోపిస్తున్న ప్రతిపక్షాల వాదనలకు కేంద్రం సమాధానం ఊతమిచ్చినట్టు అయింది. కేంద్రం లెక్కల ప్రకారం 2019లో 2.64లక్షల కోట్లు ఉన్న అప్పులు.. ఇప్పుడు రూ.4.42లక్షల కోట్లకు పెరిగినట్టయింది. ఇప్పటికీ మరిన్ని అప్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆరోపణలు వస్తున్నాయి.