బాహుబలి 2 తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా అనగానే తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా ఇండియన్ సినీ ప్రేమికులు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. జక్కన్న తదుపరి సినిమా ఏమై ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో సినిమాను ప్రకటించాడు. షూటింగ్ కార్యక్రమాలు మొదలు అయ్యే వరకు కూడా నిజమేనా అంటూ జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే వచ్చారు. 2020 సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేస్తానంటూ హామీ ఇచ్చిన జక్కన్న కరోనా వల్ల రెండేళ్ల ఆలస్యంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. జక్కన్న మూవీ కనుక ఖచ్చితంగా విజువల్ వండర్ గా మూవీ ఉంటుందని అంతా భావించారు. అనుకున్నట్లుగానే సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
ఈ చిత్రం కథం 1920 కాలంలో మొదలు అవుతుంది. ఇద్దరు గొప్ప స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించినది ఈ కథ. వేరు వేరు ప్రాంతాలకు చెందిన కొమురం భీమ్ ( ఎన్టీఆర్ ) మరియు సీతరామరాజు ( రామ్ చరణ్ ) ఎల ఒకరిని ఒకరు కలిశారు.. ఆ తర్వాత వారు ఇద్దరు కలిసి బ్రిటీష్ వారిపైకి జనాలతో ఎలా స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా యుద్దం చేశారు.. ఆ యుద్దంలో వారిద్దరు సాధించినది ఏంటీ అనేది ఈ సినిమా కథగా జక్కన్న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.
నటీనటుల :
ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ను ఇచ్చారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వారు ఇచ్చారు అనడం కంటే రాజమౌళి తీసుకున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఏ నటుడు అయినా ది బెస్ట్ ఇచ్చే వరకు రాజమౌళి ఒప్పుకోవడు. తాను అనుకున్న విధంగా వచ్చే వరకు చేస్తూనే ఉంటాడు. ఇద్దరు హీరోల ది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ క్రెడిట్ రాజమౌళికి కూడా దక్కుతుంది అనడంలో సందేహం లేదు. జక్కన్న చెప్పిన పాత్రల కోసం ఇద్దరు హీరోలు మౌల్డ్ అయిన తీరు అద్బుతం అనడంలో సందేహం లేదు.
ఇద్దరు హీరోలు వారి వారి పాత్రలకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. సినిమాలో ఇతర పాత్రల్లో నటించిన వారు కూడా వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు. ఆలియా కూడా నటనతో పాటు తన లుక్ తో మెప్పించింది. అయితే ఆలియా పాత్రకు ఉన్న ప్రాముఖ్యత ఎక్కువే అయినా ఆమె స్క్రీన్ ప్రజెన్స్ తక్కువగా ఉంది. ఉన్నంతలో ఆమె తన నటనతో ఆకట్టుకుంది. ఇక ఇతర పాత్రల్లో నటించిన వారు కూడా చక్కని నటనతో ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణులు:
రాజమౌళి దర్శకత్వంలో హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కు ఏమాత్రం తీసిపోడు అంటూ బాహుబలి సినిమా తోనే నిరూపితం అయ్యింది. ఆయన స్థాయిని ఈ సినిమా మరింత ఎక్కువ పెంచింది అనడంలో సందేహం లేదు. తాను అనుకున్న కథలో ఇద్దరు స్టార్ హీరోలను తీసుకుని స్క్రీన్ ప్లేను నడిపించిన తీరు అభినందనీయం. ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరితో ది బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చేలా వారిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. సంగీతంతో కీరవాణి ప్రాణం పోశాడు అనడంలో సందేహం లేదు. ఆయన బీజీఎం సూపర్. సినిమాటోగ్రపీ గురించి కూడా ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.
పాజిటివ్ పాయింట్స్ :
- ఎన్టీఆర్, చరణ్ నటన,
- యాక్షన్ సన్నివేశాలు,
- ఇంటర్వెల్ ముందు సన్నివేశం,
- రాజమౌళి మార్క్ మేకింగ్.
నెగటివ్ పాయింట్స్:
- సెకండ్ హాఫ్ కాస్త స్లో గా ఉంది.
- బలమైన కథ లేకపోవడం
చివరిగా:
రాజమౌళి నుండి ఇద్దరు స్టార్ హీరోల మల్టీ స్టారర్ అనగానే జనాలు.. ప్రేక్షకులు.. అభిమానులు ఏమైతే ఆశించారో.. ఏదైతే కోరుకున్నారో అదే ఇందులో ఉంది అనడంలో సందేహం లేదు. అద్బుతమైన విజువల్ వండర్ గా ఈ సినిమా ను ఆయన మల్చిన తీరు సూపర్. ఇద్దరు హీరోలు కూడా కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వడం తో పాటు జక్కన్న ఊహను అందుకుని వారు నటించి మెప్పించారు. ప్రతి సన్నివేశం కూడా ఒక అద్బుతం అన్నట్లుగా సాగింది.
తెలుగు బులెటిన్ రేటింగ్: 3.25/5.0