తెలంగాణలో ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల( YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్( KCR) కి ఆమె స్పెషల్ గిఫ్ట్ పంపారు. ‘ తెలంగాణ ప్రజలు కేసీఆర్ కి బై చెబుతున్నారు’ అని రాసి ఉన్న సూట్ కేస్ ని ఆమె కేసీఆర్ కి గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆమె స్పందించారు.
‘ రేపటి ఫలితాల్లో గెలవబోయేది కాంగ్రెస్సే. కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి తప్ప అభివృద్ధి కనిపించలేదు. అందుకే ఆయనకి తెలంగాణ ప్రజలు బై చెప్పబోతున్నారు. ఆయన ఇక ప్యాకప్ చేసుకోవాల్సిందే. రాష్ట్ర ప్రజలు ఆయనకి రెండుసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకొని ప్రతి వర్గాన్ని ఆయన మోసం చేశారు. బీజేపీ కేసీఆర్ తోనే ఉందన్న విషయం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. రేపటి రోజున దాని తాలూకా ఫలితాలను చూడబోతున్నారు. కేసీఆర్ అవినీతిపై ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇవన్నీ ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే కెసిఆర్ కి బై చెప్పబోతున్నారు’ అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం ఓట్ల లెక్కింపు జరగనుంది. పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెలువడగా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో వెల్లడైంది.