2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీశాయి. ఎంతోమంది రాజకీయ మేధావులను ప్రధానులు, రాష్ట్ర పతుల్ని చేసిన ఘన చరిత్ర ఆ పార్టీది. అయితే గత కొన్నాళ్లుగా సరైన నాయకత్వం లేక చతికిల పడింది. క్రమంగా ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోతూ పతనం అంచున నిలబడింది. ఒకానొక సందర్భంలో పంజాబ్, పుదుచ్చేరి ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో లేకుండా పోయింది. ఇక కాంగ్రెస్ పని అయిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకరంటూ ప్రత్యర్థులు హేళన చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభాలకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా అధిష్టానం అడుగులేసింది. ప్రశ్నార్థకంగా మారిపోయిన పార్టీ భవిష్యత్తుకు సమాధానం కోసం వెతుకులాట మొదలుపెట్టింది. కాంగ్రెస్ ని కమ్మేసిన కారుమబ్బులను ఛేదించడానికి సునీల్ కనుగోలు అనే వెలుగు రేఖను వెతికి పట్టుకుంది. పార్టీ భవిష్యత్తును మొత్తం అతడి చేతిలో పెట్టింది.
కనుగోలు కథ ఏంటి?
కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతానికి చెందిన సునీల్.. తెలుగు మూలాలున్న వ్యక్తి. ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ టీం లో కొన్నాళ్లపాటు పనిచేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కి పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ టీం నుంచి బయటకు వచ్చి గతేడాది తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె పార్టీకి స్ట్రాటజిస్ట్ గా పనిచేసి ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. దీంతో సునీల్ పేరు వెలుగులోకి వచ్చింది. అదే ఏడాది ప్రశాంత్ కిషోర్ టీం తో కాంగ్రెస్ జత కట్టాలని ప్రయత్నించినా అది ఫలించలేదు. దీంతో కాంగ్రెస్ కి తో పనిచేయడానికి సునీల్ ముందుకొచ్చారు. ఆ పార్టీతో జాయిన్ అయిన వెంటనే ‘భారత్ జోడో’ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సుమారు 4,000 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. ఆయాత్ర సూపర్ సక్సెస్ అవ్వడంతో మిషన్ కర్ణాటక మొదలుపెట్టారు.
కర్ణాటక కుంభస్థలం బద్దలు
సునీల్ కర్ణాటక బాధ్యతలు చేపట్టే నాటికి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తం గా ఉంది. దీంతో పార్టీలో ప్రధాన సమస్య అయిన సమన్వయ లోపంపై ఆయన దృష్టి సారించారు. పార్టీలో అందర్నీ ఏకతాటిపై తెచ్చి ఎన్నికలకు సిద్ధం చేశారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య తోడుగా ఎన్నికల ప్రణాళిక రచించారు. అప్పటి ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఉన్న అవినీతి ఆరోపణలను పదేపదే ఎత్తిచూపుతూ ‘పేసీఎం’, ‘40% సర్కార్’ అనే అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. దీంతో అక్కడ మే 13న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గాను 135 స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని ఏర్పాటు చేసింది. పార్టీకి అందించిన సేవలకు గాను కర్ణాటక ప్రభుత్వం ఆయన్ని ప్రధాన సలహాదారుగా నియమిస్తూ క్యాబినెట్ హోదా కట్టబెట్టింది.
ఈసారి తెలంగాణ పై గురి
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుతో తిరిగి ఊపిరి పీల్చుకున్న కాంగ్రెస్ పార్టీ సునీల్ సూచనలతో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ మొదలుపెట్టింది. మరో నాలుగైదు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో సెమీఫైనల్స్ గా భావించి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సునీల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ముఖ్యంగా తెలంగాణ పైనే దృష్టి పెట్టింది. పేపర్ లీకేజీ, కౌలు రైతులకు రైతుబంధు అందకపోవడం, దళిత బంధు, గ్రూప్స్ అభ్యర్థుల ఆత్మహత్యలు వంటి ప్రభుత్వ ప్రతికూలతలను సునీల్ ఆ పార్టీకి ప్రచార అస్త్రాలు గా మార్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చడం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ని తొలగించడం, వైయస్ షర్మిల ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవడం వంటి అంశాలను అనుకూలంగా మార్చుకొని కాంగ్రెస్ కి సునీల్ గెలుపు బాటలు వేశారు. ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి సీనియర్ నేతలను రెడీ చేశారు. దీంతోపాటు సబ్బండ వర్గాలను ఆకర్షించేలా మేనిఫెస్టోని ప్రకటించడం, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే వాటన్నింటిని అమలు చేస్తామని చెప్పించడంతో 119 స్థానాలకి గాను 64 స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ చేసుకుంది.
తమిళనాడు ఎన్నికల తర్వాత తెలంగాణలో ఎన్నికల కోసం పనిచేయాల్సిందిగా సీఎం కేసీఆర్ నుంచి సునీల్ కి ఆహ్వానం అందింది. వీరిద్దరూ కలిసి సమావేశం కూడా అయ్యారు. సునీల్ కి కేసీఆర్ భారీ ఆఫర్ కూడా ఇచ్చినట్లు అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఆఫర్ ని సునీల్ తిరస్కరించి కాంగ్రెస్ తో చేయి కలిపారు.