ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్వేషపూరిత వ్యాఖ్యలే చేసింది.! కమ్మరావతి, ముంపు ప్రాంతం, ఎడారి, స్మశానం.. ఇలాంటి మాటలు వైసీపీ నేతల నుంచి, అందునా మంత్రుల నుంచి అమరావతిపై వచ్చాయంటే, అది విద్వేషం కాక మరేమిటి.?
రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల్ని ఖాకీలు చితక్కొట్టారు.. బూటుకాళ్ళతో నలిపేశారు.. మహిళలన్న విచక్షణ లేకుండా లాఠీలతో విరుచుకుపడ్డారు.! సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా అమరావతిలో రైతుల మీద అకృత్యాలు జరిగాయన్నది అందరికీ తెలిసిన విషయమే.
పరదాలు కప్పుకుని ముఖ్యమంత్రి సహా, మంత్రులు అమరావతి రోడ్లపై వెళ్ళాల్సి వచ్చింది. అణచివేతని అమరావతి రైతులు లెక్క చేయలేదు. పోరాటం చేస్తూనే వున్నారు. భూములిచ్చిన పాపానికి ఇంత దారుణ హింసకు ప్రభుత్వం పాల్పడటమా.? అని అమరావతి రైతులు ఇంకా నెత్తీ నోరూ బాదుకుంటూనే వున్నారు.
‘రాజధాని ఎక్కడికీ వెళ్ళదు. అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటున్నా..’ అని 2019 ఎన్నికలకు ముందు చెప్పి, హైద్రాబాద్ నుంచి అమరావతికి కాపురం మార్చి, అక్కడే ప్యాలెస్ కట్టుకుని, అక్కడి నుంచే రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఆ అమరావతి మీద విద్వేషం వెల్లగక్కారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
అమరావతిలో రాజధాని పేరుతో ఒక్క ఇటుక కూడా అదనంగా వైసీపీ హయాంలో పేర్చబడలేదంటే, రాజధాని పట్ల ఎంతటి విద్వేషంతో వైసీపీ అధినాయకత్వం వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడిక విశాఖ మీద పడింది మనసు.! రుషి కొండని తొలిచేశారు.. అక్కడో ప్యాలెస్ కట్టేశారు.! కాపురం విశాఖలో.. అంటూ గత కొన్నేళ్ళుగా చెబుతూ వస్తున్నారు వైఎస్ జగన్. చాలా పండగలు వచ్చాయ్.. వెళ్ళాయ్.. ముహూర్తాలు మారుతూ వచ్చాయి. తాజా ముహూర్తం, వచ్చే ఎన్నికలు.. ఆ తర్వాత పదవీ ప్రమాణ స్వీకారమట.!
మళ్ళీ గెలిచి, విశాఖ నుంచే పరిపాలన చేస్తానంటున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. విశాఖలోనే కాపురం వుంటాననీ చెబుతున్నారు. కామెడీ ఏంటంటే, అమరావతి మీద ఎలాంటి ద్వేషమూ లేదనీ, అది శాసన రాజధానిగా వుంటుందనీ, రాజధాని మాత్రం విశాఖపట్నమేననీ వైఎస్ జగన్ సెలవిచ్చారు.
అమరావతిని కమ్మరావతి అన్నారు కదా.? మరి, విశాఖను ఏం అనబోతున్నారబ్బా.? విశాఖ మీద ఎలాంటి నిందలు వేయాలని ప్లాన్ చేస్తున్నారబ్బా.? ఈ ప్రశ్నలు విశాఖ వాసుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి.
ఇంతకీ, న్యాయ రాజధాని కర్నూలు సంగతేంటి.? సందట్లో సడేమియా, కర్నూలుకి వైసీపీ పూర్తి స్థాయిలో మొండిచెయ్యి చూపినట్లే కనిపిస్తోంది. రాయలసీమ బిడ్డ కదా.. ఆ రాయలసీమలోని కర్నూలుపై సీతకన్నేయడమేంటబ్బా.? అదే మరి మ్యాజిక్కు అంటే.!
అమరావతి అనుభవం.. విశాఖ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ‘వద్దు మహాప్రభో..’ అంటూ ముఖ్యమంత్రి ‘రాజధాని’ వ్యాఖ్యలపై విశాఖ వాసులు గుస్సా అవుతున్నారు. ‘అయినా, నువ్వు గెలిస్తే కదా.?’ అంటూ సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్పై సెటైర్లు పడుతున్నాయ్.
దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర రాజధాని పట్ల ఇంతటి విద్వేషం ప్రదర్శించిన దాఖలాల్లేవు. ఏ రాష్ట్ర రాజధాని మీద కూడా కులం ముద్ర వేసిన సందర్భమే లేదు.! ఏ రాజధానినీ ఎడారి అనిగానీ, స్మశానం అనిగానీ ఇప్పటిదాకా ఏ అధికార పార్టీ అన్న దాఖలాలే లేవు. ఆ ఘనత పూర్తిగా వైసీపీకే దక్కుతుంది.