మూడు రాజధానుల ఎపిసోడ్కి సంబంధించి రాష్ట్ర ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజానీకం, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఈ విషయమై సానుకూలతే కన్పిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఓ మోస్తరు గందరగోళం కన్పిస్తోంది. అయితే, ఇక్కడా భిన్నాభిప్రాయాలు లేకపోలేదు. మరోపక్క, రాయలసీమ ప్రజానీకం జ్యుడీషియల్ క్యాపిటల్ని పూర్తిస్థాయిలో స్వాగతిస్తున్నారు. అంతే కాదు, కర్నూలులో అదనంగా మినీ సెక్రెటేరియట్ కావాలన్నది వారి డిమాండ్. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజల మూడ్ దాదాపుగా ఇలానే కన్పిస్తోంది.
సో, అధికార వైసీపీకి.. పెద్దగా సమస్య లేనట్లే. మరోపక్క, అమరావతి విషయమై జరిగే న్యాయ పోరాటం ఏమవుతుంది.? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘మాకు న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని గట్టి నమ్మకంతో వున్నాం..’ అంటున్నారు అమరావతి రైతులు. ‘మేం ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చాం.. ప్రభుత్వం మాకు ఏం చెప్పిందో, అది చేస్తే తప్ప.. మా ఒప్పందాలకు విలువ వుండదు. పూర్తిస్థాయి రాజధాని అని అమరావతిని ప్రకటించాకనే, అప్పటి విపక్షాలు ఒప్పుకున్నాకనే ప్రభుత్వానికి భూములు ఇచ్చాం గనుక.. పూర్తి రాజధాని తప్ప, శాసన రాజధాని అంటే.. అసలు ఆ ఒప్పందాల్లో అర్థమే లేదు..’ అన్నది రైతుల వాదన.
నిమ్మగడ్డ రమేష్కుమార్ విషయంలో ఏం జరిగిందో, మూడు రాజధానుల విషయంలోనూ అదే జరుగుతుందని కొందరు న్యాయ నిపుణులు అభిప్రాయపడ్తుండడం గమనార్హం. అయితే, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని కొందరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఉండవల్లి అరుణ్కుమార్ లాంటోళ్ళు, అసలు ఆ బిల్లు లోక్సభలో పద్ధతిగా పాస్ అవలేదని ఇప్పటికీ వాదిస్తుంటారు. కానీ, ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఆనాటి పరిస్థితుల్ని ప్రస్తుత పరిస్థితులతో పోల్చి చూస్తే.. అమరావతి రైతుల న్యాయపోరాటం వారికి ఊరటనిచ్చే అవకాశం వుండకపోవచ్చేమో.! గవర్నర్ ఆమోదం తర్వాత రాజపత్రం కూడా విడుదలైన దరిమిలా, ఇప్పుడు.. కోర్టుల్లో ఈ అంశంపై ఇప్పటికే నమోదైన, ఇకపై నమోదు కానున్న పిటిషన్లపై విచారణ ఎలా జరుగుతుందో.. ఎలాంటి తీర్పులు వస్తాయో వేచి చూడాల్సిందే. ఒక్కటి మాత్రం నిజం.. అమరావతి రైతులకు న్యాయం జరగాల్సిందే.