వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైల్లో వున్నప్పుడు, బయట వ్యవహారాలు నడిపింది విజయమ్మ, వైఎస్ షర్మిలే కదా.! తెరవెనుకాల వైఎస్ జగన్ సతీమణి భారతి రెడ్డి ఏం చేశారు.? అన్నదానిపై బిన్న వాదనలున్నాయి. అది వేరే సంగతి.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయ్యాక, తన భర్త తరఫున రాజకీయ తెరపైకొచ్చారు నారా భువనేశ్వరి. భువనేశ్వరితోపాటు, బ్రాహ్మణి కూడా ప్రజా క్షేత్రంలో కనిపిస్తున్నారు. గతంలో అంటే, అప్పట్లో వైఎస్ విజయమ్మ ప్రత్యక్ష రాజకీయాల్లో వున్నారు. కానీ, నారా భువనేశ్వరి కావొచ్చు, నారా బ్రాహ్మణి కావొచ్చు.. ఏనాడూ రాజకీయాల్లో లేరు.
చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నారా భువనేశ్వరి చెబుతున్న మాటల్ని జనం ఎంతవరకు ఆసక్తిగా వింటున్నారు.? ఎంతవరకు ఆమె పట్ల సానుభూతి చూపిస్తారు.? అన్న ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు చెప్పడం తొందరపాటు అవుతుంది. భువనేశ్వరి తెలుగు లాంగ్వేజ్ ఒకింత ఇబ్బందికరంగానే వుంది. కొన్ని తప్పులూ దొర్లుతున్నాయి. వీటిని వైసీపీ ట్రోల్ చేస్తోంది.
‘సిగ్గూ శరం బొత్తిగా వదిలేశారు.. లేకపోతే, భువనేశ్వరి తెలుగు లాంగ్వేజ్ మీద ట్రోల్ చేయడమేంటి..’ అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. నిజమే మరి, భువనేశ్వరి ఏనాడూ రాజకీయ ప్రసంగాలు చేసింది లేదు. ఇప్పుడు తప్పక ఆమె రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు.
‘వైనాట్ 175’ అంటోన్న వైసీపీ, ఎన్నడూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేని భువనేశ్వరికి కూడా భయపడుతుండడం ఒకింత ఆశ్చర్యకరం. సరే, భువనేశ్వరి తన భర్తను వెనకేసుకొస్తూ, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పా.? కాదా.? అన్నది మళ్ళీ వేరే చర్చ.!
‘నన్ను తిడుతున్నారు..’ అంటూ మంత్రి రోజా కంటతడి పెడితే, ‘అబ్బో.. ఓ మహిళ కంటతడి పెట్టే పరిస్థితి తెచ్చారు..’ అంటూ వైసీపీ నేతలే వాపోయారు. భువనేశ్వరి కూడా ఓ మహిళ అన్న విషయాన్ని మర్చిపోయి, ఆమెను విమర్శిస్తున్నారిప్పుడు వైసీపీ నేతలు. నిజానికి, భువనేశ్వరి రాజకీయం, టీడీపీకి ప్లస్ అవుతోంది. అదే వైసీపీ బెంగ ఇప్పుడు.!