ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిసినా గెలిచిన అభ్యర్ధుల సంబరాలు ఇంకా ముగియలేదు. విజయోత్సవాలు, వేడుకలు, ఊరేగింపులు, భోజనాలు, మందుతోపాటు మరికొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ మద్దతుతో గెలిచిన ఓ సర్పంచ్ ఏకంగా రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని కోరుకొండ మండలం కాపవరం గ్రామ పంచాయతీలో సర్పంచ్ గా గెలిచిన జాజుల రాము స్థానిక కొబ్బరితోటలో పార్టీ ఏర్పాటు చేశాడు.
అమ్మాయిలతో రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు. వార్డు మెంబరు కూడా గెలవడంతో వారి ప్రమాణస్వీకారం సందర్భంగా ఈ ఏర్పాట్లు చేశాడు. ఈ సమయంలో అక్కడ చిన్న పిల్లలు కూడా ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాపు కార్పొరేషన్ ఛైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా హాజరయ్యారు. రికార్డింగ్ డ్యాన్స్ సమయంలో ఆయన అక్కడ లేరని తెలుస్తోంది. ఇటివల గోదావరి జిల్లాల్లో పలు సందర్బాలకు రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహిస్తున్నారు.