Kerala: జీపీఎస్ (GPS) టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక గమ్యం చేరుకోవడం సులభమైంది. అదే జీపీఎస్ కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఇద్దరు యువ డాక్టర్ల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. వివరాల్లోకి వెళ్తే..
కొడుంగల్లూరులోని ప్రైవేటు కాలేజీలో పని చేస్తున్న డాక్టర్లు అద్వైత్, అజ్మల్, తబ్సిర్, ఎంబీబీఎస్ విద్యార్ధిని తమన్నా, నర్స్ జిస్మాన్ కలిసి శనివారం రోజున హోండా సివిక్ కారులో ఆసుపత్రిలో విధులు ముగించుకుని బయలుదేరారు. ఆదివారం అద్వైత్ పుట్టినరోజు కావడంతో షాపింగ్ జరుపుకున్నారు. అర్ధరాత్రి 12.30 సమయంలో భారీ వర్షం పడుతూండటంతో దారి కనిపించక గూగుల్ మ్యాప్ (Google map) ఆధారంగా డ్రైవ్ చేస్తున్నారు అద్వైత్.
అయితే.. జీపీఎస్ రీ-రూట్ అయి దారిలో నీరు నిలిచిన ప్రాంతాన్ని చూపడంతో రోడ్డుగా భావించి ముందుకు వెళ్లిపోయారు. నది అని గ్రహించేలోపే కారు మునిగిపోయింది. బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో డాక్టర్లు అద్వైత్, అజ్మల్ ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ముగ్గురూ గాయపడ్డారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం అలముకుంది. జీపీఎస్ తక్కువ ట్రాఫిక్ వైపు దారి చూపడం.. ఒక్కోసారి సురక్షితమైనవి కావని అంటున్నారు.