Tdp-Janasena-Bjp: బీజేపీ(Bjp)తో టీడీపీ (Tdp)-జనసేన (Janasena) పొత్తు ఉంటుందా.. లేదా..? అనే ఊహాగానాలకు తెరపడింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ స్పష్టం చేశారు. ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సుమారు 50నిముషాలు భేటీ అయిన తర్వాత వీరంతా ఒక అవగాహనకు వచ్చారు. దీంతో కూటమి ఖరారైనట్టు రవీంద్ర కుమార్ ప్రకటించారు. పొత్తులో భాగంగా కొన్న ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు బీజేపీ-జనసేనకు వెళ్తాయని స్పష్టం చేశారు.
‘రాష్ట్ర భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని.. వ్యతిరేక ఓటు చీలకుండా జగన్ ను అధికారం నుంచి దించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. అసంతృప్తులకు చంద్రబాబు సర్దిచెప్తారు. ఎవరికీ అన్యాయం జరగకుండా.. పార్టీల బలాబలాల ఆధారంగా పొత్తు కుదిరింది. అధికారంలో ఉండగా బీజేపీ నుంచి రావాల్సినవన్నీ సాధించాం. 5ఏళ్లలో అభివృద్ధి చేయకుండా వ్యక్తిగత లాభం చూసుకున్నారు. వచ్చే సమావేశాల్లో సీట్ల సర్దుబాటు.. పోటీ స్థానాలు ఫైనల్ అవుతాయి. వచ్చే సమావేశంలో అన్ని విషయాలూ వెల్లడిస్తా’మని అన్నారు.