ఇదీ మార్పు అంటే.! తెలుగుదేశం పార్టీ – జనసేన పార్టీ కలిసి పని చేయాలనుకుంటున్నప్పుడు, కొందరు టీడీపీ మద్దతుదారులు కావొచ్చు, కొందరు టీడీపీ నేతలు కావొచ్చు.. ఈ కలయికని చెడగొట్టేందుకు తెరవెనుక చాలా చాలా ప్రయత్నాలు చేశారు.. ఇంకా చేస్తూనే వున్నారు. టీడీపీ అను‘కుల’ మీడియా సంగతి సరే సరి.!
కానీ, పరిస్థితులు మారాయి. మరీ ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టు తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో టీడీపీ నేతలు ఒకరొకరుగా స్వరం మార్చుతున్నారు. సానుకూలంగా స్పందిస్తున్నారు.
చిన్నా చితకా ఇంకెవరైనా టీడీపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల అసహనంతో వుంటే, వారికీ బాలయ్య కామెంట్స్ తర్వాత జ్ఞానోదయం అవ్వాల్సి వుంటుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో చేపట్టనున్న వారాహి విజయ యాత్రకు తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అవడం, ఈ క్రమంలో న్యాయ నిపుణులతో చర్చోపచర్చల నేపథ్యంలో ఢిల్లీలోనే నారా లోకేష్ వుంటుండడంతో.. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాల్ని నందమూరి బాలకృష్ణ పర్యవేక్షిస్తున్నారు.
తాజాగా, పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అనంతరం కీలక నిర్ణయాల్ని నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. అందులో అతి ముఖ్యమైనది, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టనున్న వారాహి యాత్రకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడం, వారాహి విజయ యాత్రలో టీడీపీ శ్రేణులు కూడా పాల్గొనబోతున్నాయి బాలయ్య ప్రకటన నేపథ్యంలో.
మొత్తంగా కృష్ణా జిల్లాలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన క్లీన్ స్వీప్ చేసే దిశగా, బాలకృష్ణ ప్రకటన దోహదపడనుందన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. గ్రామ స్థాయిలో టీడీపీ – జనసేన శ్రేణులు ఇంత త్వరగా కలుస్తాయని బహుశా వైసీపీ ఊహించి వుండదు.