ఫైబర్ నెట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu)దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ మరొకసారి వాయిదా పడింది. ఈ కేసును ఈ నెల 30న విచారిస్తామని జస్టిస్ అనిరుద్, జస్టిస్ బేల ఎం. త్రివేది తో కూడిన ధర్మాసనం తెలిపింది. ఏపీ సిఐడి పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు సుప్రీం ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిని పరిగణన లోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం ఈనెల 30న విచారణ చేపడతామని చెప్పింది. అప్పటివరకు చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసు తీర్పుని దీపావళి సెలవులు తర్వాత వెల్లడిస్తామని చెప్పింది.
ప్రస్తుత కేసుకు సెక్షన్ 17 ఏ నిబంధన వర్తిస్తున్నందున స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీర్పువచ్చాకే విచారిస్తామని స్పష్టం చేసింది. కేసు ముగిసే వరకు అరెస్టు చేయకూడదన్న కోర్టు ఆదేశాలను కొనసాగించాలని చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్ర ధర్మసనాన్ని కోరగా అందుకు అంగీకరించింది.తొలుత ఈ కేసును ఈ నెల 23న విచారిస్తామని చెప్పగా.. లూథ్ర విజ్ఞప్తి మేరకు ఈనెల 30కి వాయిదా వేసింది.