రష్యా-ఉక్రెయిన్ మద్య 34 రోజులుగా యుద్ధం జరుగుతోంది. ఇరు దేశాలు నష్టపోతున్నా, నాటో ఒత్తిడి వస్తున్నా రష్యా తమ సైనిక దాడిని ఉపసంహరించుకోలేదు.. ఉక్రెయిన్ తలొగ్గలేదు. అయితే.. అంతర్జాతీయ శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉంటామని రష్యా-ఉక్రెయిన్ మొగ్గు చూపడంతో యుద్ధం ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు.
‘రాజధాని కీవ్, చెర్నెహైవ్ నగరాల్లో తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని రష్యా భావిస్తోంది. రష్యా శాంతి ఒప్పందానికి ముందుకు రావడంలో ఉక్రెయిన్ సైనికుల ధీరత్వమే కారణం. అయినా.. రష్యాను నమ్మేది లేదు. ఇంకా వారి సైన్యం పటిష్టంగానే ఉంది. ఎక్కడా నిర్లక్ష్యం చూపొద్దు. రష్యా గురించి ఉక్రెయినియన్లు తెలుసుకున్నారు. రష్యా నుంచి వచ్చే ఖచ్చితమైన నిర్ణయాన్ని మాత్రమే నమ్ముతాం. ఉక్రెయిన్ హక్కులపై రాజీ పడే ప్రసక్తే లేద’ని అన్నారు.
ఓపక్క శాంతి చర్చలు జరుగుతూండగానే మరోవైపు రష్యా దాడులు కొనసాగిస్తోంది. మైకోలివ్ ప్రాంతంలో రష్యా చేసిన వైమానిక దాడుల్లో 12 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది.